తొలి సారి అంతరిక్షంలోకి జర్నలిస్టులు

by John Kora |
తొలి సారి అంతరిక్షంలోకి జర్నలిస్టులు
X

- మిషన్‌కు లారెన్ సాంచెజ్ నేతృత్వం

- జెఫ్ బెజోస్‌కు చెందిన న్యూ షెపర్డ్‌లో ప్రయాణం

- క్రూలో పాప్ సింగర్ కేటీ పెర్రీ

- ఎన్ఎస్-31లో అందరూ మహిళలే

- 1963 తర్వాత ఇదే తొలి సారి

దిశ, నేషనల్ బ్యూరో: అంతరిక్షంలోకి తొలి సారిగా ఇద్దరు జర్నలిస్టులు ప్రయాణించనున్నారు. జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ అనే సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్‌లో ఈ ఏడాది మార్చి తర్వాత మహిళా జర్నలిస్టులు లారెన్ సాంచెజ్, గేల్ కింగ్ అంతరిక్షయానం చేయనున్నారు. బ్లూ ఆరిజిన్ ఎన్ఎస్-31 మిషన్ ద్వారా మొత్తం ఆరుగురు మహిళా క్రూ అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. వీరిలో ఇద్దరు జర్నలిస్టులతో పాటు ప్రముఖ సింగర్ కేటి పెర్రి, అమెరికన్ ఏరో స్పేస్ ఇంజనీర్ ఐషా బోయీ, పౌర హక్కుల కార్యకర్త అమండా న్యూయెయిన్, అమెరికా ఫిల్మ్ ప్రొడ్యూసర్ కెరియానే ఫ్లైన్ ఉన్నారు. వచ్చే మార్చి తర్వాత మిషన్ ఎన్ఎస్-31 ప్రయోగం ఉటుందని బ్లూ ఆరిజిన్ తెలిపింది. కాగా, 1963లో రష్యా కాస్మోనాట్ వాలెంటీనా తెరిష్కోవా ఒంటరిగా స్పేస్‌లోకి ప్రయాణించింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ కేవలం మహిళలే అంతరిక్షంలోకి అడుగుపెట్టనుండటం గమనార్హం. జెఫ్ బెజోస్ కాబోయే భార్య, మాజీ న్యూస్ కరస్పాండెంట్ లారెన్ సాంచెజ్ ఈ మిషన్‌కు నేతృత్వం వహించనున్నారు. బ్లూ ఆరిజిన్ రూపొందించిన న్యూ షెపర్డ్ రాకెట్ సబ్ ఆర్బిటల్ ప్రయాణాల కోసం ఉపయోగిస్తారు. అంతరిక్షానికి సరిహద్దుగా గుర్తింపు పొందిన కర్మాన్ రేఖపై నుంచి భూమిని వీక్షించడమే కాకుండా, దాదాపు నాలుగు నిమిషాల పాటు గ్రావిటీ లేని స్థితిని అనుభవించే వీలుంటుంది. కాగా, ఇది న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్‌కు పదకొండవ మానవ సహిత ప్రయోగంగా నిలవనుంది.

Next Story

Most Viewed