Priyanka Gandhi: కన్వర్ యాత్రలో కొత్త రూల్స్‌పై విరుచుకుపడ్డ ప్రియాంక

by Harish |
Priyanka Gandhi: కన్వర్ యాత్రలో కొత్త రూల్స్‌పై విరుచుకుపడ్డ ప్రియాంక
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని కన్వర్ యాత్ర మార్గంలో హోటళ్ల యజమానుల పేర్లు ప్రదర్శించాలని ఇటీవల అక్కడి పోలీసులు ఆదేశాలు ఇవ్వగా, దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ దీనిపై స్పందిస్తూ, ఈ ఆర్డర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కులం, మతం ఆధారంగా సమాజంలో విభజనను సృష్టించడం రాజ్యాంగ విరుద్ధమైన నేరం. ఈ ఉత్తర్వును తక్షణమే ఉపసంహరించుకోవాలి, దీనిని జారీ చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్‌మీడియా ఎక్స్‌లో అన్నారు. మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఎలాంటి ప్రాతిపదికన కూడా వివక్ష చూపదని హామీ ఇస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని బండ్లు, తినుబండరాలను విక్రయించే దుకాణాల యజమానుల పేర్లను ప్రదర్శించాలనే రూల్ రాజ్యాంగంపై దాడి లాంటిదని ఆమె అన్నారు.

కన్వర్‌ యాత్ర యూపీలో ఘనంగా జరుగుతుంది. ఈ క్రమంలో యాత్ర మార్గంలో హోటళ్లు, దాబాలు, రోడ్డు పక్కన బండ్లు, తినుబండారాలను విక్రయించే వారు తమ పేర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని అక్కడి పోలీసు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై విమర్శలు రావడంతో వారు స్పందించి.. యాత్రకు వస్తున్న వారికి శాకాహారం ఎక్కడ లభిస్తుందో సులువుగా తెలుసుకోవడానికి కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు. అయితే ఇది సామాజికంగా వివిధ వర్గాల ప్రజల మధ్య వివాదం సృష్టించే విధంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. ప్రసుతం ఈ ఉత్వర్వులు రాజకీయ వివాదానికి దారితీశాయి. AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ దీనిపై స్పందిస్తూ, ముస్లింల దుకాణం నుండి ఏమీ కొనకుండా ఉండేందుకే ఈ చర్య తీసుకున్నట్టు ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed