దేశంలోని తల్లులు, సోదరీమణులకు మోడీ క్షమాపణ చెప్పాలి : రాహుల్ గాంధీ

by Dishanational4 |
దేశంలోని తల్లులు, సోదరీమణులకు మోడీ క్షమాపణ చెప్పాలి : రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో : మాజీ ప్రధాని హెచ్​డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్​ రేవణ్ణ 400 మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ సంచలన ఆరోపణ చేశారు. ఈ అఘాయిత్యాలను ఆయన కెమెరాలో చిత్రీకరించారని పేర్కొన్నారు. గ్యాంగ్ రేప్‌లకు తెగబడిన ప్రజ్వల్​ రేవణ్ణకు ఓట్లు వేయండని ప్రజలను అడిగిన పాపానికి దేశంలోని తల్లులు, సోదరీమణులకు క్షమాపణలు చెప్పాలని ప్రధాని మోడీని ఆయన డిమాండ్​ చేశారు. కర్ణాటకలోని శివమొగ్గలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రజ్వల్​ రేవణ్ణ చేసింది సెక్స్​ కుంభకోణం కాదని.. అది సామూహిక అత్యాచారమని మండిపడ్డారు.

‘‘ప్రజ్వల్‌కు ఓటు వేస్తే తనకు సహాయం చేసినట్లు అవుతుందని ఎన్నికల ప్రచార సభలో మోడీ చెప్పారు. ప్రజ్వల్ దురాగతాలను చూసైనా కర్ణాటకలోని ప్రతి మహిళ కళ్లు తెరవాలి. ప్రజ్వల్ ఏం చేశారో ప్రధానికి బాగా తెలుసు. రాష్ట్రంలోని బీజేపీ నాయకులందరికీ తెలుసు. అయినా ప్రజ్వల్‌‌తో, అతడి కుటుంబానికి చెందిన జేడీఎస్ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది’’ అని రాహుల్ గాంధీ విమర్శించారు. ‘‘ప్రజ్వల్ లాంటి నీచుడి తరఫున ఎన్నికల ప్రచారం చేసినందుకు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ నాయకులంతా దేశంలోని ప్రతి మహిళకు క్షమాపణలు చెప్పాలి. ప్రపంచంలోని ఏ నాయకుడు కూడా ఇలాంటి రేపిస్టు కోసం ప్రజలను ఓట్లు అడగరు’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం.. సీట్ల కోసం.. సిద్దాంతాలను పక్కకు పెట్టి బీజేపీ దేనికైనా బరితెగిస్తుంది అనడానికి ఈ పరిణామాలే నిదర్శనమని కాంగ్రెస్ అగ్రనేత విరుచుకుపడ్డారు.

Next Story

Most Viewed