Bangladesh : బంగ్లా పరిస్థితులపై భారత్ సమీక్ష.. ప్రధాని మోడీ సారథ్యంలో కీలక సమావేశం

by Hajipasha |
Bangladesh : బంగ్లా పరిస్థితులపై భారత్ సమీక్ష.. ప్రధాని మోడీ సారథ్యంలో కీలక సమావేశం
X

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులు, అక్కడ మారిన రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ సారథ్యంలో భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సోమవారం సాయంత్రం సమావేశమైంది. బంగ్లాదేశ్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల గురించి ఈసమావేశంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వివరించారు. ఈతరుణంలో భారత్ వ్యూహాత్మకంగా ఎలా స్పందించాలనే దానిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మీటింగ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, క్యాబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌబ, ప్రధాని ప్రిన్సిపల్ సెక్రెటరీ పీ.కే.మిశ్రా, రా చీఫ్ రవిసిన్హా, ఐబీ డైరెక్టర్ తపన్ డేకా పాల్గొన్నారు. షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు చేరుకున్న నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మరోవైపు హసీనాతో జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్ఏ) అజిత్ దోవల్ భేటీ అయ్యారు.

ఇందిరాగాంధీ కల్చర్ సెంటర్‌ను ధ్వంసం చేసిన అల్లరిమూకలు

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో నిరసనల సందర్భంగా కొందరు అల్లరి మూకలు ఇందిరాగాంధీ కల్చర్ సెంటర్, బంగబంధు మెమోరియల్ మ్యూజియంలను ధ్వంసం చేశారు. బంగబంధు మెమోరియల్ మ్యూజియంను షేక్ హసీనా తండ్రి, బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రహ్మాన్‌ స్మారకార్ధం నిర్మించారు.

బంగ్లా కొత్త ప్రభుత్వంతోనూ భారత్ కలిసి పనిచేస్తుంది : పినాక్ రంజన్ చక్రవర్తి

బంగ్లాదేశ్‌లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతోనూ భారత్ కలిసి పనిచేస్తుందని గతంలో బంగ్లాదేశ్‌లో భారత హైకమిషనర్‌గా సేవలందించిన పినాక్ రంజన్ చక్రవర్తి తెలిపారు. బంగ్లాదేశ్‌లో అశాంతి, అస్థిరత ఉండటం అనేది ఈ రీజియన్‌కు అంత మంచిది కాదన్నారు. ‘‘రాజకీయ నాయకులు మారొచ్చు. కానీ దేశాల దీర్ఘకాలిక ప్రయోజనాలు మారవు. బంగ్లాదేశ్ మునుపటి నుంచీ భారత్‌కు మిత్రదేశంగానే ఉంటోంది’’ అని ఆయన చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed