Pak citizen: రాజస్థాన్ సరిహద్దుల్లోకి పాక్ పౌరుడు.. అదుపులోకి తీసుకున్న బీఎస్ఎఫ్

by vinod kumar |
Pak citizen: రాజస్థాన్ సరిహద్దుల్లోకి పాక్ పౌరుడు.. అదుపులోకి తీసుకున్న బీఎస్ఎఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్-పాకిస్థాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో అనుమానాస్పద పాక్ వ్యక్తిని బీఎస్ఎఫ్ ఆదివారం అదుపులోకి తీసుకుంది. ఆ వ్యక్తిని పాకిస్థాన్ ఖరోడీ జిల్లాలోని ఆక్లీ గ్రామ నివాసి జగ్సీ కోలీగా గుర్తించారు. జగ్సీ అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. ఈ నెల 24, 25 మధ్య రాత్రి దేశంలోకి చొరబడినట్టు భావిస్తున్నారు. సాధారణ పెట్రోలింగ్‌లో భాగంగా అధికారులు ఓ వ్యక్తి పాదముద్రలను గుర్తించారు. అనుమానం వచ్చి ఆ ప్రాంతంలోని కెమెరాలను పరిశీలించగా అనుమానాస్పద వ్యక్తి తిరుగుతున్నట్టు కనిపించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలోనే స్థానిక ప్రజల సహకారంతో సెడ్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని నయా తాల్ సరిహద్దు పోస్ట్‌లో నిందితుడిని పట్టుకున్నారు. చోహ్తాన్ సర్కిల్ ఆఫీసర్ కృతికా యాదవ్ ఈ అరెస్టును ధ్రువీకరించారు. బీఎస్ఎఫ్ అధికారిక నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, ఆ తర్వాత కేసు నమోదు చేస్తామని చెప్పారు.

ప్రస్తుతం అరెస్టైన నిందితుడు ఎవరు? సరిహద్దు దాటి ఇక్కడికి ఎందుకు వచ్చారు? అనే విషయాలను తెలుసుకోవడానికి భద్రతా సంస్థలు విచారిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ప్రధాని పర్యటన నేపథ్యంలో జరిగిన ఘటనను తీవ్రమైన భద్రతా లోపంగా పలువురు పరిగణిస్తున్నారు. ఇండో-పాక్ అంతర్జాతీయ సరిహద్దులో ఫెన్సింగ్ ఉన్నప్పుడు ఎవరైనా సరిహద్దును ఎలా దాటగలరని ప్రశ్నిస్తు్న్నారు. భారత సరిహద్దు వద్ద అప్రమత్తతను పరీక్షించడానికి, భారత భూభాగంలోకి వారు మరింత సులభంగా చొరబడే ప్రదేశాలను గుర్తించడానికి పాకిస్తాన్ ఏజెన్సీలు ప్రణాళికలు వేసే చాన్స్ ఉందని భావిస్తున్నారు. అంతకుముందు సెప్టెంబరు 2019లో భల్‌చంద్‌గా గుర్తించబడిన ఒక పాకిస్తానీ జాతీయుడు అంతర్జాతీయ సరిహద్దు వద్ద కంచెను దాటగా బీఎస్ఎఫ్ అరెస్టు చేసింది.

Advertisement

Next Story

Most Viewed