ఈశాన్య రాష్ట్రాల్లో వరదల బీభత్సం

by Shamantha N |
ఈశాన్య రాష్ట్రాల్లో వరదల బీభత్సం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు, నదులు ప్రమాద స్థాయికి దాటి ప్రవహిస్తుండటంతో అసోం, అరుణాచల్ ప్రదేశ్ లలో పరిస్థితులు అధ్వానంగా మారాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దిగజారుతుందని అధికారులు చెబుతున్నారు. అసోంలో సోమవారం నాటికి 19 జిల్లాల్లోని 1,275 గ్రామాలు వర్షాల వల్ల ప్రభావితం అయ్యాయి. 6.4 లక్షల మంది వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 11 జిల్లాల్లోని 72 సహాయ శిబిరాల్లో 8,142 మంది ఆశ్రయం పొందుతున్నారు. కరీంగంజ్, టిన్సుకియా, లఖింపూర్, దిబ్రూగఢ్ లలో అత్యధిక సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. ఈ ఏడాది ఇప్పటి వరకు వరదల కారణంగా అసోంలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రహ్మపుత్ర, దేశాంగ్, సుబంసిరి, దేఖో, బురిదేహింగ్, బెకి, బరాక్ నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. రాబోయే నాలుగు రోజుల్లో అసోంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.

అరుణాచల్ ప్రదేశ్ లో పాఠశాలలకు సెలవులు

అరుణాచల్ ప్రదేశ్ లోని పరిస్థితి దారుణంగా మారింది. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో పలు ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా.. జులై 6 వరకు పాఠశాలలు మూసివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నంసాయ్, చాంగ్లాంగ్ ప్రాంతాలో చిక్కుకున్న 500 మంది అధికారులు రక్షించారు. ముంపు గ్రామాల ప్రజలను రక్షించేందుకు అరుణాచల్ ప్రదేశ్ అధికారులు అసోం రైఫిల్స్ సాయం తీసుకున్నారు.

మణిపూర్ లో భారీ వర్షాలు

మణిపూర్ రాజధాని ఇంఫాల్ జిల్లాలోని ప్రధాన నదుల్లో వరద ప్రమాద స్థాయికి చేరుకోవడంతో అధికార యంత్రాంగం వరద హెచ్చరిక జారీ చేసింది. మణిపూర్ రాష్ట్రవ్యాప్తంగా రాబోయే ఐదురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. దీంతో, అధికారులు వరద హెచ్చరిక జారీ చేశారు. ఇకపోతే, ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు, ప్రజలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇంఫాల్, నంబుల్ నదీ పరివాహర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

Next Story

Most Viewed