నకిలీ ఆధార్ కార్డుల కలకలం.. భారీగా ఫేక్ కార్డులు సీజ్

by Dishanational4 |
నకిలీ ఆధార్ కార్డుల కలకలం.. భారీగా ఫేక్ కార్డులు సీజ్
X

దిశ, నేషనల్ బ్యూరో : మిలిటరీ ఇంటెలీజన్స్ వర్గాలు సంచలన సమాచారాన్ని సేకరించాయి. కేరళ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న దాదాపు 50 వేల మంది బంగ్లాదేశ్‌, శ్రీలంక‌, మ‌య‌న్మార్‌ శ‌ర‌ణార్థుల‌ వద్ద న‌కిలీ ఆధార్ కార్డులు ఉన్నట్లు గుర్తించింది. అసోం, బెంగాల్‌, కేర‌ళ‌లోని ఆధార్ కేంద్రాల్లో ఈ న‌కిలీ ఆధార్‌లను తయారు చేస్తున్నట్లు వెల్లడించింది. భారత్‌లో నివాసం ఏర్పరుచుకునేందుకే ఆ నకిలీ కార్డుల‌ను వాడుతున్నట్లు తెలిపింది. కేర‌ళ పోలీసులు తాజాగా బుధవారం తనిఖీలు నిర్వహించి పలు దేశాల శరణార్ధుల వద్దనున్న వంద‌లాది న‌కిలీ ఆధారు కార్డుల‌ను సీజ్ చేశారు. ఆధార్ చ‌ట్టం ప్ర‌కారం న‌కిలీ ఆధార్ కార్డు క‌లిగిన వారికి మూడేళ్ల జైలు లేదా ల‌క్ష జ‌రిమానా విధించే అవ‌కాశాలు ఉంటాయి. మిలిటరీ ఇంటెలీజెన్స్ ఇచ్చిన ఈ స‌మాచారం ఆధారంగా సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) మన దేశంలోని సరిహద్దు రాష్ట్రాల్లో నిఘాను మరింత పెంచింది. విదేశీయులు అక్ర‌మంగా కేర‌ళ‌లోకి చొర‌బ‌డుతున్న‌ట్లు ఏడాది క్రిత‌మే కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించాయి. మ‌ల్ల‌పురంలో ఉన్న ఆధార్ కేంద్రంలోకి అక్ర‌మంగా చొర‌బ‌డి 50 ఆధార్ కార్డుల‌ను త‌యారు చేశారనే ఆరోప‌ణ‌లు వచ్చాయి. బెంగాల్‌, జార్ఖండ్ నుంచి ఐపీ అడ్రస్‌లతో కేర‌ళ‌లో ఆధార్ కేంద్రాల‌ను హ్యాక్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

Next Story