ఎన్నికల్లో ఉల్లిపాయలే మమ్మల్ని ఏడిపించాయి: సీఎం షిండే ఆసక్తికర వ్యాఖ్యలు

by vinod kumar |
ఎన్నికల్లో ఉల్లిపాయలే మమ్మల్ని ఏడిపించాయి: సీఎం షిండే ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో వ్యవసాయ సంక్షోభం అధికార మహాయుతి కూటమికి తీవ్ర నష్టం కలిగించిందని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే అన్నారు. ముంబైలో మంగళవారం జరిగిన వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ సమావేశంలో షిండే మాట్లాడారు. నూతన కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశమై మద్దతు ధరను నిర్ణయించే అంశాన్ని లేవనెత్తుతానని తెలిపారు. ‘ఉత్తర మహారాష్ట్రలో ప్రధాన ఉత్పత్తి ఉల్లిపాయలు. వీటి కారణంగానే మేము సమస్యలను ఎదుర్కొన్నాం. లోక్ సభ ఎన్నికల్లో ఈ అంశమే మమ్మల్ని ఏడిపించింది’ అని వ్యాఖ్యానించారు.

వ్యవసాయ సంబంధిత సమస్యల గురించి తాను ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడానని. అలాగే ఉల్లి, సోయాబీన్‌, పత్తికి మద్దతు ధర నిర్ణయించడంపై కేంద్ర వ్యవసాయ మంత్రితో చర్చిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటోందని అన్నారు. కాగా, చిల్లర ధరలను నియంత్రించేందుకు గతేడాది డిసెంబర్‌లో ఉల్లి ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించడంతో ముఖ్యంగా నాసిక్ బెల్ట్‌లో రైతుల నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో మే ప్రారంభంలో దీనిపై బ్యాన్ ఎత్తి వేశారు. ఈ ఎఫెక్ట్ లోక్ సభ ఎన్నికలపై పడింది. శివసేన, దాని మిత్రపక్షం బీజేపీ నాసిక్, దిండోరి లోక్‌సభ స్థానాలను కోల్పోయాయి. మరఠ్వాడాలో ఒక సీటును, విదర్భలో కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగాయి.

Advertisement

Next Story

Most Viewed