2000 నాటి ఎర్రకోటపై దాడి కేసులో పాక్ ఉగ్రవాది క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణ

by S Gopi |
2000 నాటి ఎర్రకోటపై దాడి కేసులో పాక్ ఉగ్రవాది క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణ
X

దిశ, నేషనల్ బ్యూరో: దాదాపు 24 ఏళ్ల నాటి ఎర్రకోటపై దాడి కేసులో దోషిగా తేలిన పాకిస్థాన్ ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ క్షమాభిక్ష పిటిషన్‌ను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించినట్లు అధికారులు బుధవారం తెలిపారు. 2022, జూలై 25న పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రపతి తిరస్కరించిన రెండవ క్షమాబిక్ష పిటిషన్ ఇదే. ఇదే కేసులో మరణశిక్షకు సంబంధించి 2022, నవంబర్ 3న ఆరిఫ్ రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఉరిశిక్షను సమర్థించిన సుప్రీంకోర్టు.. ఆరిఫ్‌కు అనుకూలంగా ఎలాంటి ఉపశమన కల్పించే పరిస్థితులు లేవని పేర్కొంది. ఎర్రకోటపై దాడి దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమాధికారానికి ప్రత్యక్ష ముప్పు అని స్పష్టం చేసింది. మే 15న ఆరిఫ్ క్షమాభిక్ష పిటిషన్‌ను స్వీకరించిన రాష్ట్రపతి కార్యాలయం మే 27న తిరస్కరిస్తూ సచివాలయం ఉత్తర్వులు ఇచ్చిందని అధికారులు పేర్కొన్నారు. అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం.. సుధీర్ఘ జాప్యం కారణంగా మరణశిక్ష పడిన దోషి తన శిక్షను మార్చాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానం తలుపులు తట్టవచ్చని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. కాగా, 2000, డిసెంబర్ 22న జరిగిన దాడిలో ఎర్రకోట ప్రాంగణంలోని 7 రాజ్‌పుతానా రైఫిల్స్ యూనిట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిగారు. ఆ ఘటనలో ముగ్గురు ఆర్మీ సిబ్బంది మరణించారు. దాడి జరిగిన నాలుగు రోజుల తర్వాత పాకిస్తాన్ పౌరుడు, నిషేధిత లష్కరే తోయిబా సభ్యుడు ఆరిఫ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed