నాలుగు రోజుల పాటు ఇండియన్ నేవీ అధికారుల సమావేశం

by Harish |   ( Updated:2024-09-15 15:16:46.0  )
నాలుగు రోజుల పాటు ఇండియన్ నేవీ అధికారుల సమావేశం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌ చుట్టు పక్క దేశాల్లో పెరుగుతున్న అస్థిర పరిస్థితుల నేపథ్యంలో నేవీ అధికారులు భారత దేశ భద్రత, ఇతర అంశాలపై చర్చించడానికి సమావేశం కాబోతున్నారు. సెప్టెంబర్ 17 నుంచి మొదలు కానున్న ఈ సమావేశాలు నాలుగు రోజుల పాటు జరగనున్నాయి. బంగ్లాదేశ్‌లో ఆందోళనలు, అక్కడ తీవ్రవాద రాడికల్ గ్రూపుల ప్రభావం పెరగడం వల్ల ఉద్భవిస్తున్న భద్రతా సమస్యలు, పెరుగుతున్న చైనా కార్యకలాపాలు, పాకిస్తాన్‌ నుంచి పొంచి ఉన్న ప్రమాదం, భారత్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెరుగుతున్న అస్థిర పరిస్థితులను ఎదుర్కోవడం వంటి పలు విషయాలపై వీటిలో చర్చించనున్నట్లు నేవీ అధికారి తెలిపారు.

అలాగే, నేవీ ప్రణాళికలు, సముద్రపు దొంగలు, డ్రోన్ దాడులు, కొత్త జలాంతర్గాములు వంటి వాటిపై కూడా నేవీ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహిస్తారు. ఢిల్లీలోని కొత్త నేవీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుందని రక్షణ శాఖ అధికారులు పేర్కొన్నారు. లక్నోలో జాయింట్ కమాండర్ల సదస్సులో ఊహించని వాటికి సిద్ధంగా ఉండాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల రక్షణ దళాలకు పిలుపునిచ్చిన తర్వాత ఈ సమావేశం జరగనుండటం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్‌లో నావికాదళ చీఫ్‌గా అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది మొదటి సదస్సు.

Advertisement

Next Story

Most Viewed