కుమారుడు నిశాంత్‌ను రాజకీయాల్లోకి తెచ్చే ప్రయత్నాల్లో 'పల్టు రామ్'

by S Gopi |
కుమారుడు నిశాంత్‌ను రాజకీయాల్లోకి తెచ్చే ప్రయత్నాల్లో పల్టు రామ్
X

దిశ, నేషనల్ బ్యూరో: బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్(యూనైటెడ్) అధినేత నితీశ్ కుమార్ తన వారసుడిని రాజకీయాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్య క్షీణిస్తున్నట్టు కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో పార్టీ భవితవ్యంపై సందేహాలు నెలకొన్నాయి. బీహార్‌లోని ఒక వర్గం జేడీయూ త్వరలో కనుమరుగవుతుందని, ఇతర పార్టీలో విలీన అవ్వొచ్చని భావిస్తోంది. ఈ నేపథ్యంలో అటువంటి ఊహాగానాలకు చెక్ పెట్టడానికి నితీశ్ కుమార్ చర్యలు ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. కొన్నేళ్లుగా అధికారంలోనే కొనసాగేందుకు కూటమి భాగస్వామ్యాలను తనకు అనుగుణంగా మారుస్తూ 'పల్టు రామ్'గా పేరున్న నితీశ్, పార్టీని చెక్కుచెదరకుండా, అధికారంలోనే ఉంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. దానికోసం ఇప్పటికే పార్టీ పునర్వ్యవస్థీకరణ ప్లాన్‌ను రూపొందించినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

దాని ప్రకారం, నితీశ్ ప్రస్తుతం బీహార్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న తన విశ్వసనీయ లెఫ్టినెంట్ శ్రవణ్ కుమార్‌కు పార్టీ పగ్గాలు అప్పగించనున్నారు. శ్రవణ్ నితీశ్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడు. పార్టీ నిర్ణయాల్లో కీలకంగా ఉంటారు. నితీశ్ ఇండియా కూటమిలో ఉండటంతో యూపీలో బాధ్యతలను శ్రవణ్ నిర్వహించారు. అంతేకాకుండా వారణాని నియోజకవర్గం నుంచి ప్రధాని మోడీపై పోటీకి కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో శ్రవణ్‌ను పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు అప్పగిస్తూనే, తన కుమారుడు నిశాంత్ రాజకీయ ఎంట్రీ కోసం నిర్ణయాలు తీసుకునేందుకు నితీశ్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం తన తండ్రిలాగే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన నిశాంత్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల నితీశ్‌తో కలిగి పలు పర్యటనలు చేశారు. తండ్రీకొడుకులు ఇటీవల సొంత జిల్లా నలందను సందర్శించారు. అక్కడ ఇద్దరూ కలిసి ఓ ఆలయంలో ప్రార్థనలు చేసి, అనంతరం వివిధ సామాజిక రాజకీయ కార్యక్రమాలకు హాజరయ్యారు.

అయితే, నిశాంత్ రాజకీయాల్లోకి రావడం వల్ల నితీశ్‌కు కొంత ప్రతికూల ఎదురుకానుంది. కుటుంబ రాజకీయాలను తరచూ వ్యతిరేకించే నితీశ్ కుమార్ ఇప్పుడు సొంత కుమారుడిని పార్టీ కోసం రాజకీయాల్లోకి తీసుకురావడం కొత్త విమర్శలకు దారితీయవచ్చు. ఈ మధ్యే రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ కుటుంబ రాజకీయంపై విమర్శలు చేశారు. మరి ఇప్పుడు కుమారుడి కోసం ఎలాంటి వ్యూహాలను రచిస్తారో చూడాల్సి ఉంది.



Next Story