భారత్ అగ్రరాజ్యంగా ఎదుగుతుంటే.. మనం అడుక్కుంటున్నాం

by Dishanational1 |
భారత్ అగ్రరాజ్యంగా ఎదుగుతుంటే.. మనం అడుక్కుంటున్నాం
X

దిశ, నేషనల్ బ్యూరో: పొరుగుదేశం పాకిస్తాన్ రోజురోజుకి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థిక కష్టాలతో ఇబ్బందులు పడుతోంది. ఐఎంఎఫ్ నిధులు అందించకపోతే ఆ దేశ పరిస్థితి మరింతగా దిగజారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కీలక నేత, ప్రతిపక్ష జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం(ఎఫ్) అధ్యక్షుడు మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన భారత్‌పై ప్రశంసలు కురిపించడం చర్చనీయాంసమైంది. ఈరోజు భారతదేశం అగ్రరాజ్యంగా ఎదిగే దిశగా ప్రయాణిస్తుంటే, ప్రపంచ దేశాల నుంచి ఆర్థిక సాయం ద్వారా దివాల నుంచి బయటపడేందుకు పాకిస్తాన్ అడుక్కుంటోందని తీవ్రంగా స్పందించారు. ఈ పరిస్థితికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. పాకిస్తాన్‌లోని రాజకీయ నేతలు భారత్‌ను ఎంత వ్యతిరేకించినా, ఆ దేశం అభివృద్ధిలో మనకంటే చాలా ముందుకు వెళ్లిందనే విషయాన్ని అంగీకరించాల్సిందేనని రెహ్మాన్ పేర్కొన్నారు.

ప్రస్తుత పాక్ పార్లమెంటు చట్టబద్ధతపై రెహ్మాన్ సందేహాలు లేవనెత్తారు. సభ్యులు పాలన విషయంలో రాజీ పడుతున్నారని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతున్నారని ఆరోపించారు. పాకిస్తాన్ ప్రభుత్వంలో నిజమైన ప్రాతినిధ్యం లేకపోవడం గురించి ఆందోళన వ్యక్తం చేసిన మౌలానా ఫజ్రూల్ రెహ్మాన్, దేశ నాయకత్వాని నిర్ణయించడంలో బ్యూరోక్రాట్లు, ఉన్నత వర్గాల ప్రభావం ఉందని విమర్శించారు. ఇంకా ఎంతకాలం రాజీపడతాం, ఎంపీలుగా ఎన్నికయ్యేందుకు బయటి శక్తుల సాయం ఎంతకాలం ఆశిద్దాం అని ప్రశ్నించారు. ఇస్లాం మతం ఆధారంగానే పాకిస్థాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడిందని గుర్తుచేసిన రెహ్మాన్.. ఇప్పుడు పాకిస్థాన్ సెక్యులర్ దేశంగా తయారయిందన్నారు. 1973 నుంచి కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ (సీఐఐ) ఇచ్చిన ఏ ఒక్క ప్రతిపాదనను కూడా ప్రభుత్వాలు పాటించనప్పుడు... ఇది ఇస్లామిక్ దేశం ఎలా అవుతుందని అన్నారు.

Next Story

Most Viewed