బంగ్లాదేశ్ హైకమిషనర్‌కు సమన్లు

by John Kora |
బంగ్లాదేశ్ హైకమిషనర్‌కు సమన్లు
X

- భారత్‌ను ప్రతికూలంగా చిత్రీకరించడంపై అసహనం

- ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతం కలుగుతుందని హెచ్చరిక

- షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు

- వెల్లడించిన విదేశాంగ శాఖ

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ తాత్కాలిక హైకమిషనర్ నూరుల్ ఇస్లామ్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు జరీ చేసింది. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఢాకాలోని భారత తాత్కాలిక హైకమిషనర్‌కు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ నిరసన నోట్‌ను పంపింది. హసీనా వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో శుక్రవారం బంగ్లా హైకమిషనర్‌ను పిలిపించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. భారత్, బంగ్లాదేశ్ మధ్య సానుకూలమైన, నిర్మాణాత్మక, పరస్పర ప్రయోజనకరమైన సంబంధాలను కలిగి ఉండాలని మేం భావిస్తున్నాము. ఈ విషయాలను ఇటీవల జరిగిన పలు ఉన్నత సమావేశాల్లో కూడా చెప్పాము. కానీ బంగ్లాదేశ్ అధికారులు మాత్రం వారి స్టేట్మెంట్లలో భారత్‌ను ప్రతికూల దేశంగా చిత్రీకరిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలే భారత్ పట్ల నెగిటివిటీని పెంచుతుందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం. వాటితో భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఇలాంటి వాటితో భారత్‌కు లింక్ పెట్టడం ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తుందని పేర్కొంది. భారత ప్రభుత్వం ఎలాగైతే పరస్పర ప్రయోజనకరమైన సంబంధాలను కోరుకుంటోందో.. బంగ్లా కూడా అదే విధంగా స్పందిస్తే.. ఇరు దేశాల మధ్య మంచి వాతావరణం ఉంటుందని తెలిపింది. కాగా, షేక్ హసీనా తండ్రి ఇంటిని కొంద మంది దుండగులు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో బంగ్లాలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వానికి సహకరించవద్దని తన అనుచరులను హసీనా ఒక వీడియోలో కోరారు. యూనస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత హైకమిషనర్‌కు బంగ్లా నిరసన నోట్ పంపింది.

Next Story