అమెరికాలో తప్పిపోయి.. శవమై తేలాడు

by John Kora |
అమెరికాలో తప్పిపోయి.. శవమై తేలాడు
X

- టెక్సాస్‌లో తప్పిపోయిన ఆంధ్రావాసి

- ఆరు నెలలుగా నిరుద్యోగంతో సతమతం

- మృతదేహం తరలింపుకు విరాళాల సేకరణ

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ప్రిన్స్‌టన్‌లో ఆదివారం తప్పిపోయిన భారత సంతతి వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక పోలీసులు దీన్ని ఆత్మహత్యగా అనుమానిస్తూ.. కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన అభిషేక్ కొల్లి(30) తన భార్యతో కలిసి ఫీనిక్స్‌లో నివసించేవాడు. పెళ్లయి కేవల ఏడాది మాత్రమే గడిచిన అభిషేక్.. ఇటీవల ప్రిన్స్‌టన్‌కు మకాం మార్చాడు. గత ఆరు నెలలుగా ఉద్యోగం లేక తీవ్ర మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నాడని, అంతే కాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయని అభిషేక్ కవల సోదరుడు అరవింద్ కొల్లి చెప్పారు. అయితే ఆదివారం నుంచి కనపడకుండా పోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలిస్తున్న సమయంలోనే అతని మృతదేహాన్ని కనుగొన్నారు.

అభిషేక్ ఆకస్మిక మరణం మాకు భరించలేని నష్టమని సోదరుడు అరవింద్ చెప్పారు. అభిషేక్ మృతదేహాన్ని ఇండియాకు తిరిగి తీసుకొని రావడానికి, అంత్యక్రియలు నిర్వహించడానికి గోఫండ్ మీ అనే ఎన్జీవో విరాళాలు సేకరిస్తున్నట్లు అరవింద్ తెలిపారు. 24 గంటల్లో 59 వేల డాలర్లను సేకరించినట్లు తెలిసింది. అమెరికాలోని తెలుగు సమాజం ఆర్థికంగా మద్దతు ఇస్తున్నట్లు అరవింద్ పేర్కొన్నారు. తమకు సహాయం చేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Next Story