వాహనదారులకు భారీ షాక్.. పెట్రోల్ , డీజిల్‌పై రూ.3 పెంపు

by Harish |
వాహనదారులకు భారీ షాక్.. పెట్రోల్ , డీజిల్‌పై రూ.3 పెంపు
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల ముగిసిన తరువాత కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు భారీ షాక్ ఇచ్చింది. తాజాగా పెట్రోల్ , డీజిల్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెట్రోల్‌పై రూ.3, డీజిల్‌పై రూ.3.05 మేర పెంచుతున్నట్లు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు నిర్ణయం తక్షణం(జూన్ 15 నుంచి) అమల్లోకి వచ్చింది. దీంతో రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ రూ.99.84 నుంచి రూ.102.84కి చేరుకుంది, రూ. 85.93గా ఉన్న లీటర్ డీజిల్ ధర రూ.88.95కు పెరిగింది. పెట్రోలియం ఉత్పత్తులపై అమ్మకపు పన్నును రాష్ట్ర ప్రభుత్వం సవరించడమే ఈ ధరల పెంపునకు కారణమని పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ పేర్కొంది.

కర్ణాటక ప్రభుత్వం తాజా నోటిఫికేషన్ ప్రకారం, పెట్రోల్ పై సేల్స్ ట్యాక్స్ 25.92 శాతం నుంచి 29.84 శాతానికి పెంచగా, డీజిల్‌పై ట్యాక్స్‌‌ను 14.3 శాతం నుంచి 18.4 శాతానికి పెంచింది. రాష్ట్రానికి మరింత ఆదాయాన్ని ఆర్జించే లక్ష్యంతో పెట్రోలియం ఉత్పత్తులపై అమ్మకపు పన్నును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.2,500-2,800 కోట్ల మేర ఆదాయం వచ్చే అవకాశం ఉందని కర్ణాటక ఆర్థిక శాఖ పేర్కొంది. ఆకస్మికంగా ధరల పెరుగుదలతో ప్రజల జేబులకు చిల్లు కానుంది.

ఐదు హామీల అమలు కోసం కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.50,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో నిధుల సమీకరణ కోసం ఇంధన ధరలు పెంచాల్సి వచ్చిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంపై కర్ణాటక బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడింది.

బీజేపీ అధికార ప్రతినిధి ఎస్ ప్రకాష్ విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచింది. దీంతో ప్రజలపై మరింత ఆర్థిక భారం పడింది. కాంగ్రెస్ పార్టీ అసలు ముఖం ఇప్పుడు బట్టబయలైంది, పథకాల వల్ల కర్ణాటకను దివాళా తీసి పన్నును పెంచారని ఆయన ఆరోపించారు.

చివరిసారిగా రాష్ట్రంలో నవంబర్ 2021లో ఇంధన ధరలను సవరించారు, కొవిడ్-19 తర్వాత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంలో సహాయపడటానికి గత బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటరుకు రూ. 13.30, డీజిల్ ధరను లీటరుకు రూ. 19.40 తగ్గించగా, తాజాగా ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ ధరలు పెంచడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed