Union Territory :బంగ్లాదేశ్ వలసలతో హిందువులు కనుమరుగు : బీజేపీ ఎంపీ దూబే

by Hajipasha |
Union Territory :బంగ్లాదేశ్ వలసలతో హిందువులు కనుమరుగు : బీజేపీ ఎంపీ దూబే
X

దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే లోక్‌సభ జీరో అవర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాలను కలిపి ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్‌ నుంచి జార్ఖండ్‌లోని సంతాల్ పరగణా, బెంగాల్‌లోని మాల్దా, ముర్షిదాబాద్, బిహార్‌లోని అరారియా, కిషన్‌గంజ్, కతిహార్‌లకు పెద్దఎత్తున వలసలు జరుగుతున్నాయని దూబే పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆయా ప్రాంతాల్లోని ఆదివాసీలు, హిందువులు కనుమరుగు అవుతారని వ్యాఖ్యానించారు.

2000 సంవత్సరంలో సంతాల్ పరగణాలో 36 శాతం మంది గిరిజనులు ఉండగా.. ఇప్పుడక్కడ వారి జనాభా 26 శాతానికి తగ్గిపోయిందన్నారు. ‘‘సంతాల్ పరగణా ఏరియాలో 100 మంది గిరిజన సర్పంచ్‌లు ఉన్నారు. వారి భర్తలు మాత్రం ముస్లింలు’’ అని దూబే ఆరోపించారు. తాను చెబుతున్న దాంట్లో అబద్ధాలు ఉన్నాయని తేలితే రాజీనామాకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. నిషికాంత్ దూబే వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ ప్రజలను విభజించేలా ఉన్న దూబే వ్యాఖ్యలను లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు.



Next Story