ముంబైలో వర్షం.. 50 విమానాలు రద్దు

by Shamantha N |
ముంబైలో వర్షం.. 50 విమానాలు రద్దు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారీ వర్షాలకు ముంబై అతలాకుతలం అయ్యింది. వర్షాల కారణంగా యాభైకి పైగా విమానాలు రద్దు అయ్యాయి. కొద్దిసేపు రన్‌వే కార్యకలాపాలను సస్పెండ్‌ చేయగా.. మొత్తం 27 విమానాలను దారి మళ్లించారు. ఆ విమానాలన్నీ హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, ఇండోర్‌ వంటి ప్రాంతాల్లో ల్యాండ్‌ అయ్యాయి. అరైవల్స్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎయిర్‌ పోర్టు వర్గాలు వెల్లడించాయి. దారి మళ్లించిన విమానాలకు ఆలస్యమైతే అవసరమైన ఏర్పాట్లు చేయడంపైన దృష్టి పెడ్తామని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. మరోవైపు, చాలా మంది ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే ఇరుక్కుపోయారు. ప్రయాణికులు బయల్దేరే ముందు విమాన సర్వీసు స్టేటస్‌ను చెక్‌ చేసుకోవాలని ముంబై విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. ప్రతికూల వాతావరణం, భారీ వర్షాల కారణంగా ప్రయాణికులు తమ విమాన సర్వీసులకు సంబంధించిన అప్ డేట్ ను ఎయిర్ లైన్స్ ద్వారా తెలుసుకోవాలనిసూచించారు. ప్రయాణానికి కొద్దిసేపు ముందే ఎయిర్ పోర్టు చేరుకోవాలని కోరారు. ఈ విషయాన్ని సీఎస్ఎంఐఏ ఎయిర్ పోర్టు ఎక్స్ లో పోస్టు చేసింది.

ఆరు గంటల్లో 300 మి.మీ. వర్షం

ముంబైలో సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ఉదయం 7 గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షంకురిసింది. కేవలం ఆరు గంటల్లోనే 300 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబై, థానే, పాల్ఘర్, కొంకణ్ ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. థానే, పాల్ఘర్, రాయ్ గఢ్, రత్నగిరి, కొల్లాపూర్ సహాపలు ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి.

Advertisement

Next Story