ఢిల్లీలో దంచికొడుతున్న వర్షం.. విమాన ప్రయాణికులకు హెచ్చరిక

by Harish |
ఢిల్లీలో దంచికొడుతున్న వర్షం.. విమాన ప్రయాణికులకు హెచ్చరిక
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది వేసవి కాలంలో ఎన్నడూ లేని విధంగా ఎండలతో హడలిపోయిన దేశ రాజధాని ఢిల్లీని ఇప్పుడు భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి కొన్ని ఏరియాల్లో నిరంతరాయంగా వర్షం కురుస్తుంది. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనిష్ట ఉష్ణోగ్రత 27.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. మంగళవారం రోజంతా కూడా తేలికపాటి వర్షంతో ఆకాశం మేఘావృతమై ఉంది. వర్షాల నేపథ్యంలో గాలి నాణ్యత సూచిక కొంత వరకు మెరుగుపడింది. AQI సూచిక మధ్యాహ్నం 1:19 గంటలకు 94 రీడింగ్‌తో మధ్యస్థంగా నమోదైంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లోని బీజేపీ కార్యాలయం సమీపంలో భారీ వర్షం నమోదైంది.

మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో స్పైస్‌జెట్ తన విమాన ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రయాణికులు ఎప్పటికప్పుడు విమానాల ప్రయాణ స్థితిని చెక్ చేసుకోవాలని కోరింది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షం వలన ఢిల్లీ నుంచి బయలుదేరే లేదా ఇక్కడికి వచ్చే అన్ని విమానాల కార్యకలాపాలలో అంతరాయాలు వచ్చే అవకాశం ఉంది, కొన్ని విమానాలు ఆలస్యం కావచ్చు అందుకే ప్రయాణికులను అప్రమత్తంగా ఉండాలని స్పైస్‌జెట్ కోరింది. బుధవారం( జులై 10)న కూడా ఢిల్లీలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ అధికారులు ప్రజలకు కీలక సూచనలు జారీ చేశారు. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

Advertisement

Next Story