Amritpal :ఎన్ఎస్ఏ కేసులు కొట్టివేయాలంటూ అమృత్ ‌పాల్ సింగ్ పిటిషన్

by Hajipasha |   ( Updated:2024-07-31 19:11:22.0  )
Amritpal :ఎన్ఎస్ఏ కేసులు కొట్టివేయాలంటూ అమృత్ ‌పాల్ సింగ్ పిటిషన్
X

దిశ, నేషనల్ బ్యూరో : జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద తనపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలంటూ పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ ఎంపీ అమృత్ ‌పాల్ సింగ్ పంజాబ్ అండ్ హర్యానా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని బుధవారం విచారించిన హైకోర్టు బెంచ్.. ఈ పిటిషన్‌పై స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అమృత్ ‌పాల్ సింగ్ డిటెన్షన్‌కు ఆర్డర్ జారీ చేయడానికి ప్రాతిపదికగా తీసుకున్న ఆధారాలతో కూడిన రికార్డులను తమకు సమర్పించాలని పంజాబ్ సర్కారుకు కోర్టు నిర్దేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఆగస్టు 28వ తేదీకి లిస్టింగ్ చేసినట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శీల్ నాగు, న్యాయమూర్తి అనిల్ క్షేత్రపాల్‌లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది.

డిటెన్షన్ ఆర్డర్‌ను జారీ చేయగానే.. అమృత్ ‌పాల్ సింగ్ సహా మొత్తం 9 మందిని 2023 మార్చి 18న అదుపులోకి తీసుకున్నారు. వారిపై గతేడాది ఏప్రిల్ 23న జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) ఉల్లంఘన అభియోగాలతో కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం అసోంలోని దిబ్రూఘర్ సెంట్రల్ జైలుకు తీసుకెళ్లి బంధించారు. అసోం జైలులో నుంచే పంజాబ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అమృత్ ‌పాల్ సింగ్.. ఖదూర్ సాహిబ్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు.

Advertisement

Next Story