Gujarat : విద్యార్థినిని హత్య చేసిన గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్

by Hajipasha |
Gujarat : విద్యార్థినిని హత్య చేసిన గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్
X

దిశ, నేషనల్ బ్యూరో : గుజరాత్‌లోని దాహోద్ జిల్లా సింగ్వాద్‌లో దారుణం జరిగింది. ఈ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపాల్ గోవింద్‌నాథ్ ఓ విద్యార్థినిని(6) గొంతు నులిమి హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. ప్రిన్సిపాల్ గోవింద్‌నాథ్ ఇంటికి సమీపంలోనే ఓ విద్యార్థిని ఇల్లు ఉండేది. గత గురువారం ఉదయం 10.20 గంటలకు ప్రిన్సిపాల్ కారులో స్కూలుకు బయలుదేరాడు. అయితే తన కూతురిని స్కూలు దాకా కారులో తీసుకెళ్లాలని ప్రిన్సిపాల్‌ను విద్యార్థిని తల్లి కోరింది. దీంతో విద్యార్థినిని కారులోకి ఎక్కించుకున్న ప్రిన్సిపాల్.. మార్గం మధ్యలో ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. అయితే బాలిక తిరగబడింది. ఆమె కారు నుంచి బయటికి వెళితే తనకు ముప్పు అని భావించిన ప్రిన్సిపాల్.. గొంతు నులిమి హత్య చేశాడు.

కారును తీసుకెళ్లి స్కూలులో పార్క్ చేశాడు. గురువారం సాయంత్రం 5 గంటలకు పాఠశాల సమయం ముగిసిన వెంటనే కారు నుంచి బాలిక డెడ్‌బాడీని తీసి... స్కూలు వెనుకనున్న ఖాళీ ప్రదేశంలో పారవేశాడు. బాలిక స్కూల్ బ్యాగు, చెప్పులను క్లాస్ రూంలో వేశాడు. స్కూల్ టైం ముగిసినా బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో.. ఆమె కుటుంబ సభ్యులు ఊరంతా గాలించారు. స్కూలు కాంపౌండ్ వెనుకే ఆమె విగత జీవిగా కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. విద్యార్థిని అప్పటికే చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. స్కూలు ప్రిన్సిపాల్ గోవింద్‌నాథ్‌ను పోలీసులు ఇంటరాగేట్ చేయగా తాను గొంతు నులిమి చంపినట్లు అంగీకరించాడు.

Next Story