ఆ ఘటన 1 శాతం నిజమైనా సిగ్గు చేటే : హైకోర్టు

by Hajipasha |
ఆ ఘటన 1 శాతం నిజమైనా సిగ్గు చేటే : హైకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ ప్రాంతంలో గిరిజనుల భూముల దురాక్రమణ, తుపాకీతో బెదిరించి మహిళలపై అత్యాచారాలు జరిపిన వ్యవహారంపై విచారణ సందర్భంగా కోల్‌కతా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీఎంసీ మాజీ నేత షేక్ షాజహాన్, అతడి అనుచరులు చేసిన అఘాయిత్యాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లలో కనీసం ఒక్క శాతం నిజమైనా..అది పూర్తిగా సిగ్గుచేటు అవుతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి దాఖలైన అఫిడవిట్లలో తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని తెలిపింది. ఇంత దారుణమైన స్థితిగతులు సందేశ్ ఖాలీలో ఉన్నా.. మహిళలకు పశ్చిమ బెంగాల్ అత్యంత సురక్షితమైన ప్రాంతమని రాష్ట్ర సర్కారు చెప్పుకోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సందేశ్ ఖాలీ బాధితుల అఫిడవిట్లలో కనీసం 1 శాతం నిజమని తేలినా.. ఆ ట్యాగ్‌ను రాష్ట్ర సర్కారు వాడుకోలేని పరిస్థితి వస్తుందని బెంచ్ పేర్కొంది. ఈ దారుణాలకు సందేశ్ ఖాలీ ఏరియాకు సంబంధించిన జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్రంలోని అధికార పార్టీ టీఎంసీ నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది.

55 రోజుల తర్వాత అరెస్టు చేస్తారా : సీజే

ఈ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న షేక్ షాజహాన్‌‌ను 55 రోజుల గ్యాప్ తర్వాత రాష్ట్ర పోలీసులు అరెస్టు చేయడంపై సీజే శివజ్ఞానం మండిపడ్డారు. ‘‘నిందితుడు షాజహాన్‌ను పట్టుకునేందుకు ఇంత సమయం ఎందుకు పట్టింది ? అతడిని పట్టుకునేందుకు 55 రోజులు ఎక్కడికి పరుగెత్తారు ? దాగుడు మూతలు ఎక్కడ ఆడారు ? మీరు కళ్లు మూసుకుంటే ప్రపంచం నల్లగా మారదు’’ అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సందేశ్‌ఖాలీ ప్రాంతంలో మహిళలపై హింసతో పాటు భూకబ్జాలపై స్వతంత్ర దర్యాప్తును చేపట్టాలంటూ బాధితులు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం వాదనలు విన్న హైకోర్టు పైవ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్లపై తీర్పును రిజర్వ్ చేసింది. కాగా, సందేశ్ ఖాలీ వ్యవహారాన్ని ఫిబ్రవరిలో హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులోని ప్రధాన నిందితుడు షాజహాన్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నాడు.

Advertisement

Next Story

Most Viewed