Election Commission : లోక్‌సభ పోల్స్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు తప్పుడు ప్రచారం : ఈసీ

by Hajipasha |
Election Commission : లోక్‌సభ పోల్స్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు తప్పుడు ప్రచారం : ఈసీ
X

దిశ, నేషనల్ బ్యూరో : 2024 లోక్‌సభ ఎన్నికల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు తీవ్ర దుష్ప్రచారం చేశారని కేంద్ర ఎన్నికల సంఘం ఆరోపించింది. మానవ చరిత్రలోనే అతిపెద్ద ఎన్నికల ఘట్టాన్ని కించపరిచేలా, దానిపై సందేహాలు కలిగించేలా కొందరు అబద్దాలను అల్లి ప్రచారం చేసేందుకు యత్నించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అభ్యర్థులు, రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో లోక్‌సభ ఎన్నికల ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొంది. ఈమేరకు వివరాలతో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఎక్స్ వేదికగా ఆదివారం ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ఓటింగ్ జరిగిన తేదీల్లో రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉన్న పోలింగ్ శాతాన్ని విడుదల చేస్తారు. కచ్చితత్వంతో కూడిన పోలింగ్ శాతం వివరాలు తెలియాలంటే మరుసటి రోజు ఉదయం వరకు వేచిచూడాలి. కానీ కొన్ని పార్టీలు తొందరపాటుతో పోలింగ్ శాతంపై అనవసర రాద్ధాంతం చేశారు. తప్పుడు ఆరోపణలు చేశారు’’ అని ఈసీ తెలిపింది.

‘యూ/ఆర్‌పీఏ 1951’ ప్రకారం..

‘‘ఎన్నికల ఫలితాలను ఎవరైనా అభ్యర్థులు సవాల్ చేయదలిస్తే ‘యూ/ఆర్‌పీఏ 1951’ ప్రకారం ఎలక్షన్ పిటిషన్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈసారి చాలా తక్కువ మంది ఈ పిటిషన్లు సమర్పించారు. 2019 ఎన్నికల సమయంలో 138 మంది లోక్‌సభ అభ్యర్థులు ఈ పిటిషన్లు వేయగా, ఇప్పుడా సంఖ్య గణనీయంగా తగ్గిపోయి 79కి చేరింది’’ అని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. గత నెలలో ‘ఓట్ ఫర్ డెమొక్రసీ’ అనే సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ‘‘ఎన్నికల్లో పోలైన ఓట్ల సంఖ్యకు, కౌంటింగ్‌లో వచ్చిన ఓట్ల సంఖ్యకు చాలా తేడా ఉంది’’ అని ఆ నివేదికలో ప్రస్తావించారు. తాజాగా ఆ అంశంపై కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ మాట్లాడుతూ.. అధ్యయన నివేదికపై వచ్చిన అభ్యంతరాలకు బదులివ్వాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. అందుకే తాజాగా ఆదివారం రోజు కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశంపై వివరణ ఇచ్చి ఉంటుందని భావిస్తున్నారు.



Next Story

Most Viewed