Air India: సిబ్బంది భద్రతే ముఖ్యం.. దాడి ఘటనపై స్పందించిన ఎయిర్ ఇండియా

by Shamantha N |
Air India: సిబ్బంది భద్రతే ముఖ్యం..  దాడి ఘటనపై స్పందించిన ఎయిర్ ఇండియా
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎయిర్ ఇండియా మహిళా సిబ్బందిపై జరిగిన దాడిపై ఆసంస్థ యాజమాన్యం స్పందించింది. లండన్‌లోని ఓ హోటల్‌లో మహిళా సిబ్బందిపై జరిగిన దాడిపై ఎయిర్ ఇండియా ప్రకటన విడుదల చేసింది.‘‘సిబ్బంది, క్రూ భద్రత, సంక్షేమానికి ఎయిర్‌ ఇండియా అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. మా సంస్థ ఉద్యోగి, ఆమె బృందానికి అవసరమైన అన్ని రకాల మద్దతుని అందజేస్తాం. అవసరమైతే ప్రొఫెషనల్‌ కౌన్సిలింగ్‌ అందిస్తాం. అంతర్జాతీయంగా పేరున్న హోటల్ లోకి అక్రమంగా చొరబడడాన్ని ఖండిస్తున్నాం. స్థానిక పోలీసులతో కలిసి చట్ట ప్రకారంగా ముందుకు వెళ్తాం. నిందితుడిపై చర్యలు తీసుకుంటాం. ఆ హోటల్‌ యాజమాన్యం కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి. బాధితుల వ్యక్తిగత గోప్యతను పాటించాలని కోరుతున్నాం’’ అని ఎయిర్‌ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. స్వల్ప గాయాలతో బయటపడిన బాధితురాలిని ఆసుపత్రికి తరలించామని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. ప్రస్తుతం మహిళ భారత్‌కు తిరిగి వచ్చిందని, ఆమెకు కౌన్సెలింగ్ ఇస్తున్నామని వెల్లడించారు.

అసలేం జరిగిందంటే?

ఎయిర్‌ ఇండియా ఎయిర్ హోస్టెస్ పై లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలోని రాడిసన్‌ హోటల్‌ గదిలో అర్ధరాత్రి 1.30 సమయంలో దాడి జరిగింది. ఆమె తలుపులు వేయడంతో.. నిందితుడు మహిళను హ్యాంగర్‌తో కొట్టి.. నేలపై ఈడ్చుకొని వెళ్లేందుకు యత్నించాడు. బాధితురాలు గదిలో నుంచి బయటకు పారిపోయేందుకు తీవ్రంగా యత్నించారు. బాధితురాలు భయంతో కేకలు వేయడంతో ఆమె సహచరులు అక్కడికి వచ్చారు. దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకున్నారు. అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, నిందితుడిని అక్కడ వీధుల్లో జీవించే వ్యక్తిగా గుర్తించారు. ఇకపోతే, అంతపెద్ద హోటల్‌లో కనీస భద్రత లేకపోవడంతో పలువురు షాక్‌ అయ్యారు. ఎయిర్ హోస్టెస్ తో కలిసి పనిచేస్తున్న సహచరులు రావడంతో పెనుప్రమాదం తప్పింది.

Advertisement

Next Story

Most Viewed