హర్యానాలోని అన్ని స్థానాల్లో పోటీ: జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా

by Dishanational2 |
హర్యానాలోని అన్ని స్థానాల్లో పోటీ: జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా
X

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ హర్యానాలోని మొత్తం 10 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్టు జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) చీఫ్, హర్యానా మాజీ ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ప్రకటించారు. త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే ప్రజలు అధిక సంఖ్యలో తమను ఆదరిస్తారని భావిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ-జేజేపీ కూటమితో పొత్తు ముగిసిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. సొంతంగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. కాగా, లోక్ సభ ఎన్నికలకు ముందు హర్యానాలో అనూహ్య పరిణామాలు జరిగిన విషయం తెలిసిందే. లోక్ సభ సీట్ల పంపకం విషయంలో విభేదాలు రావడంతో బీజేపీ-జేజేపీ కూటమి విచ్ఛిన్నమైంది. దీంతో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేయగా..కొత్త సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ఎన్నికయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 10 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. హర్యానాలో ఆరో దశలో ఎన్నికలు జరగనున్నాయి.


Next Story

Most Viewed