Congress chief Kharge : మైనారిటీలను లక్ష్యంగా చేసుకోవడం ఆందోళనకరం.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

by vinod kumar |
Congress chief Kharge : మైనారిటీలను లక్ష్యంగా చేసుకోవడం ఆందోళనకరం.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న బుల్డోజర్ చర్యలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పౌరుల్లో భయాన్ని కలిగించడానికే బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్లను ఉపయోగిస్తోందని ఫైర్ అయ్యారు. ‘ఒకరి ఇంటిని కూల్చివేపి, వారి కుటుంబాన్ని నిరాశ్రయులను చేయడం అన్యాయం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనారిటీలపై పదే పదే ఈ తరహా దాడులు జరగడం ఆందోళనకరం. రూల్ ఆఫ్ లా ద్వారా పాలించబడే సమాజంలో ఇటువంటి చర్యలకు స్థానం లేదు’ అని పేర్కొన్నారు. అరాచకం సహజ న్యాయాన్ని భర్తీ చేయబోదని తెలిపారు.

‘బీజేపీ ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని నిర్మొహమాటంగా విస్మరించాయి. పౌరులలో భయాన్ని కలిగించడానికే బుల్డోజర్లను ఉపయోగిస్తున్నాయి. దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రభుత్వ బలవంతం ద్వారా కాకుండా నేరాలపై కోర్టుల్లో తీర్పులు రావాలి’ అని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఇటువంటి చర్యలు మానుకోవాలని లేదంటే, దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కాగా, మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో నిరసన సందర్భంగా హింసకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ నాయకుడు హాజీ షెహజాద్ అలీకి చెందిన భవనాన్ని బుల్డోజర్‌తో కూల్చి వేశారు. ఈ నేపథ్యంలోనే ఖర్గే పై వ్యాఖ్యలు చేశారు.

బుల్డోజర్ న్యాయం ఆమోదయోగ్యం కాదు: ప్రియాంకా గాంధీ

దేశంలోని అనేక రాష్ట్రాల్లో బుల్డోజర్ల చర్య ఆమోదయోగ్యం కాదని, దీనిని వెంటనే ఆపాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. బుల్డోజర్ న్యాయం పూర్తిగా ఆమోదయోగ్యం కాదని ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘ఎవరైనా ఏదైనా నేరానికి పాల్పడితే, దానిని కోర్టు మాత్రమే నిర్ధారించి నిందితులకు శిక్ష విధించాలి కానీ ఆరోపణలు వచ్చిన వెంటనే నిందితుడి ఇంటిని కూల్చివేసి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం సరికాదు’ అని పేర్కొన్నారు. ఈ చర్య అనాగరికమైందని అభివర్ణించారు.

Next Story

Most Viewed