Omar Abdullah : లెబనాన్, గాజాపై దాడులు ఆపేలా ఇజ్రాయెల్‌పై మోడీ ఒత్తిడి పెంచాలి : ఒమర్ అబ్దుల్లా

by Hajipasha |
Omar Abdullah : లెబనాన్, గాజాపై దాడులు ఆపేలా  ఇజ్రాయెల్‌పై మోడీ ఒత్తిడి పెంచాలి : ఒమర్ అబ్దుల్లా
X

దిశ, నేషనల్ బ్యూరో : హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతిపై ఇటీవలే కశ్మీర్‌కు చెందిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ స్పందించగా.. ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా రియాక్ట్ అయ్యారు. నస్రల్లా మరణంతో పశ్చిమాసియా ప్రాంతాన్ని యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని ఆయన అన్నారు.‘‘గతేడాది నుంచి పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ ఎడతెరిపి లేని దాడులు చేస్తోంది. ఆ దారుణాన్ని ఆది నుంచే మా పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నాం. అమాయక గాజా, లెబనాన్ ప్రజల ప్రాణాలు తీయడాన్ని ఖండిస్తున్నాం’’ అని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.

ఈ దాడులు ఆపేలా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహా ప్రపంచదేశాల ప్రభుత్వాధినేతలపై ఉందన్నారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హసన్ నస్రల్లా మరణం నేపథ్యంలో ఒకరోజు పాటు ఎన్నికల ప్రచారాన్ని ఆపేస్తానని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ చేసిన ప్రకటనపై తాను స్పందించనని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed