India- China: అత్యంత కఠిన ప్రదేశాల్లో చైనా సైనిక విన్యాసాలు

by Shamantha N |
India- China: అత్యంత కఠిన ప్రదేశాల్లో చైనా సైనిక విన్యాసాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియన్‌ ఆర్మీ ఫౌండేషన్‌ డే(Indian Army's foundation day) ముందు చైనా సైనిక విన్యాసాలు మొదలు పెట్టింది. అత్యంత కఠిన ప్రదేశాల్లో యుద్ధ సన్నద్ధత, లాజిస్టిక్స్‌ సరఫరా వంటి అంశాలను దృష్టిలోపెట్టుకొని టిబెట్‌లోని అత్యంత ఎత్తైన ప్రదేశంలో చైనా (China) పీఎల్‌ఏ(People’s Liberation Army) వీటిని నిర్వహిస్తోంది. షింజియాంగ్‌ మిలటరీ కమాండ్‌కు చెందిన రెజిమెంట్‌ వీటిని చేపట్టింది. సైనికుల చలనశీలత, ఓర్పును పెంచడానికి రూపొందించిన అత్యాధునిక సైనిక టెక్నాలజీ, ఆల్‌ టెర్రైన్‌ వెహికల్స్‌, అన్‌మ్యాన్డ్‌ సిస్టమ్స్‌, డ్రోన్లు, ఎక్సో స్కెలిటెన్స్‌ వంటి వాటిని ఈ విన్యాసాల్లో వాడుతున్నారు. ఈ విన్యాసాల దృష్ట్యా భారత సాయుధ దళాలు భారతదేశం-చైనా సరిహద్దులో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. అయితే, చైనా చేపట్టిన లాజిస్టిక్స్ సపోర్ట్‌ ఎక్సర్‌సైజ్‌లు కార్యచరణ పెంచాలనే సంసిద్ధతను పెంచాలనే దాని వ్యూహాత్మక ఉద్దేశాన్ని నొక్కి చెప్తున్నాయి. అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో యుద్ధం వేళ వేగంగా దళాలకు అవసరమైన పరికరాలు, ఆహారం వంటివి సరఫరా చేయడంపైనా సాధన చేస్తున్నారు. ఆ వాతావరణం కారణంగా శారీరకంగా ఎదురయ్యే సవాళ్లను తట్టుకొనేలా చైనా దళాలు ఎక్సోస్కెలిటెన్లు వాడున్నారు. ఈ విన్యాసాలు చేపట్టిన ప్రదేశం కూడా లఢఖ్ కు సమీపంలోనే ఉంది.

అప్రమత్తమైన భారత్..

భారత సైన్యం కూడా హిమాలయాల్లో పోరాటపటిమను పెంచుకొనేందుకు ఏటా హిమ్‌ విజయ్‌ డ్రిల్స్‌ నిర్వహిస్తోంది. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో వివిధ దళాల సమన్వయంతో ఆపరేషన్లు నిర్వహించడంపై సాధన చేశారు. చైనా దళాల కదలికలను గుర్తించేందుకు వీలుగా అత్యాధునిక నిఘా వ్యవస్థలు, ఉపగ్రహ చిత్రాలు, డ్రోన్లను భారత్‌ వినియోగిస్తోంది. వేగవంతమైన దళాల కదలిక, లాజిస్టిక్స్ కోసం సరిహద్దుల్లో కీలకమైన రోడ్లు, వంతెనలు, సొరంగాలు నిర్మాణాలను భారత్‌ వేగవంతం చేసింది. అంతేకాకుండా, కే9 వజ్ర హోవిట్జర్లు, ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థలు వంటి అత్యాధునిక ఆయుధాలను ప్రవేశపెట్టడం భారత పోరాట సంసిద్ధతను గుర్తు చేస్తుంది. ఇకపోతే, 2020లో గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా సైన్యం మధ్య ఘర్షణ చెలరేగడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పలుమార్లు సైనిక-దౌత్య స్థాయిల్లో చర్చలు జరగడంతో పరిస్థితి మెరుగయ్యింది.

Next Story