Karnataka CM : కర్ణాటక సర్కారును అస్థిరపరిచేందుకు కేంద్రం కుట్ర : సీఎం సిద్ధరామయ్య

by Hajipasha |
Karnataka CM : కర్ణాటక సర్కారును అస్థిరపరిచేందుకు కేంద్రం కుట్ర : సీఎం సిద్ధరామయ్య
X

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు రాజ్ భవన్‌‌ను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ - జేడీఎస్ కూటమి చేతిలో కీలుబొమ్మలా గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌ పనిచేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం మైసూరు ఎయిర్‌పోర్టులో విలేకరులతో మాట్లాడుతూ సీఎం సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్కాంలో నాకు గవర్నర్ షోకాజ్ నోటీసులను జారీ చేయడం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం’’ అని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు సీఎం సిద్ధరామయ్యకు గవర్నర్ పంపిన షోకాజ్ నోటీసుపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సారథ్యంలో సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి చర్చించింది. సీఎంకు పంపిన నోటీసును వెనక్కి తీసుకోవాలని గవర్నర్‌ను కోరాలని ఈ భేటీలో తీర్మానించారు. రాష్ట్ర మంత్రిమండలి సమావేశానికి ఎందుకు హాజరుకాలేదని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘‘నాపై వచ్చిన అభియోగాలపై చర్చించే సమావేశానికి నేను సారథ్యం వహించడం సబబుగా ఉండదు. నేను ఆ మీటింగ్‌కు హాజరైతే తప్పుడు సాంప్రదాయాన్ని మొదలుపెట్టినట్లు అవుతుంది’’ అని సీఎం సిద్ధరామయ్య శుక్రవారం తెలిపారు. ‘‘నాపై కంప్లయింట్ చేసిన కేజే అబ్రహం ఒక బ్లాక్ మెయిలర్. అలాంటి వ్యక్తి ఫిర్యాదుపై చర్యలు తీసుకోవడం చట్టవిరుద్ధం. నాలా చాలామందిపై కేజే అబ్రహం గతంలో కంప్లయింట్స్ ఇచ్చాడు’’ అని సీఎం పేర్కొన్నారు.

Advertisement

Next Story