PM Kisan Scheme : రైతులకు కేంద్రం భారీ షాక్.. రూ.416 కోట్లు వెనక్కి

by M.Rajitha |
PM Kisan Scheme : రైతులకు కేంద్రం భారీ షాక్.. రూ.416 కోట్లు వెనక్కి
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Scheme) పథకం కింద అనర్హులైన రైతుల(Ineligible Farmers) నుంచి రూ.416 కోట్లను తిరిగి వసూలు చేసింది. ఈ పథకం 2019 ఫిబ్రవరిలో ప్రారంభమై, చిన్న మరియు సన్నకారు రైతుల(Farmers)కు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో సంవత్సరానికి మూడు వాయిదాలలో రూ.6,000 వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తుంది. అయితే, ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్ సెక్టర్ ఉద్యోగులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కూడా తప్పుడు సమాచారంతో ఈ ప్రయోజనాన్ని పొందారని అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఆధార్ ఆధారిత వెరిఫికేషన్, భూమి రికార్డుల తనిఖీ, ఈ-కేవైసీ, డేటా క్రాస్-చెకింగ్ ద్వారా అనర్హులను గుర్తించి, వారి నుంచి రూ.416 కోట్లను రికవరీ చేసింది. కొందరు స్వచ్ఛందంగా చెల్లించగా, మరికొందరి విషయంలో చట్టపరమైన నోటీసులతో వసూలు చేశారు.

కాగా 2019 నుంచి ఇప్పటివరకు 19 వాయిదాల ద్వారా రూ.3.68 లక్షల కోట్లను 11 కోట్లకు పైగా రైతులకు పంపిణీ చేశారు. ఈ పథకం నిజమైన రైతులకు వ్యవసాయ ఖర్చులకు సహాయం అందించడంతో పాటు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నట్టు కేంద్రం తెలిపింది. అయితే అనర్హులకు డబ్బు చెల్లించడం వల్ల నష్టం జరగకుండా పారదర్శకతను కాపాడేందుకు ఈ రికవరీ ప్రక్రియను కొనసాగిస్తామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి లోపాలు జరగకుండా డిజిటల్ వెరిఫికేషన్ విధానాలను మరింత బలోపేతం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

Next Story