మహారాష్ట్రలో పూణే లగ్జరీ కారు కేసు తరహా యాక్సిడెంట్

by Shamantha N |
మహారాష్ట్రలో పూణే లగ్జరీ కారు కేసు తరహా యాక్సిడెంట్
X

దిశ, నేషనల్ బ్యూరో: పుణే లగ్జరీ కారు ప్రమాద కేసు మరువక ముందే మరో యాక్సిడెంట్ జరిగింది. ఈ ఉదయం ముంబైలోని వర్లీ ప్రాంతంలో అతి వేగంతో వచ్చిన బీఎండబ్ల్యూకారు బైక్ ని ఢీకొట్టింది. బైక్ పై వెళ్తున్న మహిళ అక్కిడకక్కడే చనిపోయింది. ఆమె భర్తకు తీవ్రగాయాలు కాగా.. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. వర్లిలోని కోలివాడలో తెల్లవారుజాముల 5.30 గంటకు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. చేపలు కొనుక్కోవడానికి సాసూన్ డాక్ కు వెళ్లి వస్తుండగా కారు ఢీకొట్టింది. బైక్ పైనుంచి వ్యక్తి దూకడంతో ఆయన ప్రాణాలు కాపాడుకోగలిగాడు. కానీ, మహిళ మాత్రం తప్పించుకోలేకపోయింది. అయితే, కారుని నడిపిన వ్యక్తి ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన సీనియర్ లీడర్ కుమారుడని పోలీసులు తెలిపారు. పాల్ఘర్ జిల్లాకు చెందిన శివనేత నేత రాజేష్ షా కుమారుడు 24 ఏళ్ల మిహిర్ షా అని గుర్తించామన్నారు. మిహిర్ మద్యంతాగి డ్రైవ్ చేసినట్లు అనుమానిస్తున్నామని అన్నారు. అతడి బ్లడ్ టెస్టు రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. కాగా.. మిహిర్ డ్రైవర్ రాజేంద్ర సింగ్ బిజావత్ తమ అదుపులోనే ఉన్నట్లు తెలిపారు.

కొత్త చట్టం కింద కేసు నమోదు

కొత్త నేర చట్టంలోని భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నేరపూరిత ప్రవర్తన, ర్యాష్ డ్రైవింగ్, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి సెక్షన్ల కిందకేసు నమోదుచేశామన్నారు. మిహిర్ షా శనివారం రాత్రి జుహులోని ఓ బార్‌లో మద్యం సేవించాడని పోలీసులు తెలిపారు. ఇంటికి వెళుతుండగా.. డ్రైవర్‌ని లాంగ్ డ్రైవ్ చేయమని అడిగాడని అన్నారు. వర్లీకి చేరుకున్నాక.. తాను డ్రైవ్ చేస్తానని పట్టుబట్టాడని పేర్కొన్నారు. అతి వేగంతో డ్రైవ్ చేస్తుండగా.. ఎదురుగా వచ్చిన బైక్ ని ఢీకొన్నట్లు వెల్లడించారు. మిహిర్ తన తండ్రికి ఫోన్ చేసి ప్రమాదం గురించి చెప్పాడని వివరించారు. అప్పట్నుంచి అతని ఫోన్ ఆఫ్ లోనే ఉందని.. నిందితుడికోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

ఘటనపై స్పందించిన మహా సీఎం

ఇకపోతే, సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కారుపైన శివసేన స్టిక్కర్ ని తొలగించేందుకు యత్నించారు. నంబర్ ప్లేట్ ని కూడా తొలగించినట్లు సీసీ కెమెరాలో గుర్తించామని పోలీసులు తెలిపారు. ఇకపోతే, ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. చట్టం ముందు అందరూ సమానమేనని అన్నారు. పోలీసులతో మాట్లాడి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed