ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు జారీ

by Dishanational1 |
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు జారీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, లైంగిక నేరాలకు పాల్పడిన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ గురించి సమాచారం కోరుతూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్ఫర్మేషన్(సీబీఐ) బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది. వందల సంఖ్యలో మహిళలపై లంగిక వేధింపులకు పాల్పడిన వీడియోలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో రేవణ్ణ భారత్ నుంచి జర్మనీకి పారిపోయిన సంగతి తెలిసిందే. డిప్లామాట్ పాస్‌పోర్టుపై ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీకి వెళ్లాడు. ఇప్పటికే అతన్ని భారత్‌కు తిరిగి రప్పించేందుకు కర్ణాటక ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. తాజాగా 'బ్లూ కార్నర్ నోటీస్' జారీ చేసినట్టు కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర ధృవీకరించారు. ప్రజ్వల్ రేవణ్ణ ఎక్కడ ఉన్నాడో సిట్ కనిపెడుతుందని, అనంతరం అతన్ని భారత్‌కు తీసుకురానున్నట్టు ఆయన పేర్కొన్నారు. 'ప్రజ్వల్ రేవణ్ణపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సిట్‌కు సహకరిస్తాం. విచారణ పారదర్శకంగా జరుగుతుందని, ఈ వ్యవహారంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్టు' ఆయన వివరించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ పరారీలో ఉండటంతో బ్లూ కార్నర్ నోటీసులు ఇచ్చామని స్పష్టం చేశారు. సాధారణంగా నిందితులను అరెస్ట్ చేసేందుకు రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తారు. అయితే, బ్లూ కార్నర్ నోటీసులు అంటే.. నిందితుడికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించడం. వ్యక్తి ఇతర దేశాలకు పారిపోయినప్పుడు అక్కడి పోలీసులకు సమాచారం వెల్లడించేందుకు ఈ నోటీసులు తప్పనిసరి. బ్లూ కార్నర్ నోటీసులు లేకుండా ఆ వివరాలు ఇచ్చేందుకు వీలవదు. బ్లూ కార్నర్ నోటీసుల ద్వారా దానికి అనుమతి లభిస్తుంది. ప్రస్తుతం ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీలో ఉండటంతో అతన్ని భారత్‌కు రప్పించే పనిలో అధికారులు ఉన్నారు.

Next Story

Most Viewed