బీజేపీ రాజ్యాంగాన్ని చింపేయాలని చూస్తోంది: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు

by samatah |
బీజేపీ రాజ్యాంగాన్ని చింపేయాలని చూస్తోంది: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజ్యాంగాన్ని నాశనం చేసి, గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ కోరుకుంటోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒడిశాలోని బోలంగీర్‌లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ప్రభుత్వ రంగాన్ని మొత్తం ప్రయివేటీకరించడం ఖాయమని తెలిపారు. తన చేతిలో ఉన్న భారత రాజ్యాంగ పుస్తకాన్ని చూపిస్తూ..‘బీజేపీ ఈ పుస్తకాన్ని చింపివేయాలని కోరుకుంటున్నది. కానీ కాంగ్రెస్‌, భారతదేశ ప్రజలు దీనిని అనుమతించరు’ అని చెప్పారు. ప్రపంచంలోని ఏ శక్తి కూడా రాజ్యాంగాన్ని మార్చబోదన్నారు. దేశాన్ని 22 మంది బిలియనీర్లు నడుపుతున్నారని, అందుకే ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కావాలని చెప్పారు. 2024 ఎన్నికల యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతుందని నొక్కి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మధ్య పొత్తు ఉందని, బయటికి మాత్రమే వేర్వేరుగా కనిపిస్తున్నారన్నారు.



Next Story