BJP : 8 మంది బీజేపీ నేతలపై ఆరేళ్ల బహిష్కరణ వేటు.. ఎందుకంటే ?

by Hajipasha |
BJP : 8 మంది బీజేపీ నేతలపై ఆరేళ్ల బహిష్కరణ వేటు.. ఎందుకంటే ?
X

దిశ, నేషనల్ బ్యూరో : హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ (అక్టోబరు 5) సమీపించిన వేళ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ అసెంబ్లీ స్థానాల నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన ఎనిమిది మంది బీజేపీ నేతలను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆరేళ్ల వ్యవధి కోసం వారిపై బహిష్కరణ వేటు వేశామని హర్యానా బీజేపీ చీఫ్ మోహన్ లాల్ బడోలీ వెల్లడించారు. ఈ చర్యలను ఎదుర్కొంటున్న నేతల జాబితాలో మాజీ మంత్రి రంజిత్ సింగ్ చౌతాలాతో పాటు సందీప్ గార్గ్ (లాద్వా స్థానం), జైల్ రాం శర్మ (అసంధ్), దేవేందర్ కాదియన్ (గానౌర్), బాచన్ సింగ్ ఆర్య (సఫీదోన్), రాధా అహ్లావత్ (మేహం), నవీన్ గోయల్ (గురుగ్రామ్), కేహర్ సింగ్ రావత్ (హాథిన్) ఉన్నారు.

మాజీ మంత్రి రంజిత్ సింగ్ చౌతాలా విషయానికొస్తే.. ఆయన రాణియా అసెంబ్లీ స్థానం ఇవ్వమని బీజేపీ పెద్దలను కోరారు. అయితే అందుకు వారు నిరాకరించారు. దీంతో అదే స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా చౌతాలా నామినేషన్ దాఖలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాణియా స్థానం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన ట్రాక్ రికార్డు రంజిత్ సింగ్ చౌతాలాకు ఉంది. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాణియా అసెంబ్లీ స్థానానికి చౌతాలా రాజీనామా చేసి, హిసార్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అందుకే ఈసారి రాణియా స్థానాన్ని ఆయనకు కేటాయించేందుకు బీజేపీ హైకమాండ్ ఆసక్తి చూపలేదు. కాగా, అసెంబ్లీ స్థానాల్లో ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్న 13 మంది నేతలపై కాంగ్రెస్ పార్టీ గత శుక్రవారం రోజే బహిష్కరణ వేటు వేసింది.

Advertisement

Next Story

Most Viewed