Amit Shah: 2047 నాటికి డ్రగ్స్ రహిత దేశంగా భారత్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా

by vinod kumar |   ( Updated:2025-01-11 12:14:42.0  )
Amit Shah: 2047 నాటికి డ్రగ్స్ రహిత దేశంగా భారత్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: 2047 నాటికి భారత్‌ను డ్రగ్స్ రహిత దేశంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో గత పదేళ్లలో డ్రగ్స్‌పై అలుపెరుగని పోరాటం చేశామని, ఈ దిశగా గణనీయమైన విజయాన్ని సాధించామని కొనియాడారు. ఢిల్లీలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ నేషనల్ సెక్యురిటీ’ అనే ప్రాంతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఒక్క కేజీ డ్రగ్స్‌ని కూడా దేశంలోకి, బయటికి స్మగ్లింగ్ చేయడానికి అనుమతించబోమని నొక్కి చెప్పారు. డార్క్ వెబ్, క్రిప్టోకరెన్సీ, ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్, డ్రోన్‌ల వినియోగం నేటికీ మనకు సవాల్‌గా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

2004 నుంచి 2014 మధ్య కాలంలో 3 లక్షల 63 వేల కిలోల డ్రగ్స్‌ పట్టుబడ్డాయని, కానీ గత పదేళ్లలో ఈ సంఖ్య ఏడు రెట్లు పెరిగి 24 లక్షల కిలోలకు పెరిగిందని చెప్పారు. జమ్మూ కశ్మీర్, పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లలో అనేక నార్కో-టెర్రరిజం కేసులు ఛేదించబడ్డాయని, డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో ఇవి పెద్ద విజయాలని తెలిపారు. దేశంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దాని ప్రభావాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వం మరింత చురుకుగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. 2024లో రూ.16,914 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ఎన్సీబీ, పోలీసులు అతి పెద్ద విజయం సాధించారన్నారు.

Next Story

Most Viewed