కుటుంబంలోని 8 మందిని నరికి చంపిన వ్యక్తి..ఆపై ఆత్మహత్య

by vinod kumar |
కుటుంబంలోని 8 మందిని నరికి చంపిన వ్యక్తి..ఆపై ఆత్మహత్య
X

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన కుటుంబంలోని 8మందిని నరికి చంపి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చింద్వారా జిల్లాలోని బోదల్ కచర్ గ్రామంలో నివాసముండే దినేష్ అలియాస్ భూరా బుధవారం తెల్లవారుజామున 2:30గంటల సమయంలో తన భార్య (23), తల్లి (55), సోదరుడు (35), కోడలు (30), సోదరి (16), మేనల్లుడు (5), ఇద్దరు మేన కోడల్లు(4)లను హత్య చేశాడు. నిందితుడు మొదట భార్యను గొడ్డలితో నరికి చంపి ఆ తర్వాత మిగతా వారిని హత్య చేసినట్టు తెలిపారు. అనంతరం సమీపంలోని తన మేనమామ ఇంటికి వెళ్లి ఓ పదేళ్ల చిన్నారిపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించగా ఆ చిన్నారి తప్పించుకుంది.

దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 8 మంది మృత దేహాలను గుర్తించారు. అలాగే గ్రామానికి 100 మీటర్ల దూరంలో ఓ చెట్టుకు నిందితుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకొని ఉండటాన్ని గమనించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని చింద్వారా పోలీసు సూపరింటెండెంట్ మనీష్ ఖత్రీ తెలిపారు. గతంలో చికిత్స కూడా తీసుకున్నట్టు తెలిపారు. కాగా, నిందితుడికి ఈనెల 21నే వివాహం కావడం గమనార్హం.

Advertisement

Next Story