విషాదం మిగిల్చిన విహార యాత్ర.. జలపాతంలో ఏమైందంటే..

by Hajipasha |
విషాదం మిగిల్చిన విహార యాత్ర.. జలపాతంలో ఏమైందంటే..
X

దిశ, నేషనల్ బ్యూరో : విహార యాత్ర విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం సెలవురోజు కావడంతో మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఆ కుటుంబంలోని ఏడుగురు కలిసి ముంబై సమీపంలోని లోనోవాలా ప్రాంతం సందర్శనకు వెళ్లారు. సరదాగా వారంతా కలిసి అక్కడున్న భూసీ డ్యామ్ సమీపంలోని జలపాతంలోకి దిగారు. అప్పటివరకు నెమ్మదిగానే ఉన్న జలప్రవాహం వేగం అకస్మాత్తుగా పెరగడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆ ఏడుగురు ఒకేసారి కొట్టుకుపోసాగారు. ఈక్రమంలో ఇద్దరు సాహసోపేతంగా వ్యవహరించి ఈదుకుంటూ అతి కష్టం మీద ఒడ్డుకు చేరుకొని ప్రాణాలు రక్షించుకున్నారు. మిగతా ఐదుగురికి ఈత రాకపోవడంతో జల ప్రవాహంలో కొట్టుకుపోయారు.

ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో వెంటనే జలపాతంలో రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించారు. తాళ్ల సాయంతో ట్రెక్కింగ్ చేస్తూ ఆ ఐదుగురి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించారు. ఆదివారం సాయంత్రం సమయానికి మూడు డెడ్‌బాడీస్ దొరికాయి. ఆ కుటుంబానికి చెందిన 36 ఏళ్ల మహిళ, 13 ఏళ్ల బాలిక, 8 ఏళ్ల బాలిక డెడ్‌బాడీస్ లభ్యమయ్యాయి. వీరంతా భూసీ డ్యామ్ నుంచి చాలాదూరం కొట్టుకుపోయి రిజర్వాయర్‌లో మునిగి చనిపోయినట్లు గుర్తించారు. బాధిత ఫ్యామిలీకే చెందిన తొమ్మిదేళ్ల బాలుడు, నాలుగేళ్ల బాలిక ఆచూకీ కోసం జలపాతంలో గాలింపు కొనసాగుతోంది.

Next Story

Most Viewed