Train Accident:తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం.. 19 మందికి గాయాలు

by Shamantha N |
Train Accident:తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం.. 19 మందికి గాయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మైసూరు నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా దర్బాంగ వెళ్లాల్సిన భాగమతి ఎక్స్‌ప్రెస్‌ (12578)కు ప్రమాదం జరిగింది. భాగమతి ఎక్స్ ప్రెస్ రైలు వేగంగా వచ్చి తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వేస్టేషన్‌ సమీపంలో గూడ్స్‌ రైలును ఢీకొంది. ఈ ప్రమాదంలో 13 కోచ్ లు పట్టాలు తప్పాయి. కొన్ని చెల్లాచెదురుగా పడిపోగా, మరికొన్ని ఒకదాని పైకి మరొకటి ఎక్కాయి. దాదాపు 19 మందికి గాయాలు అయినట్లు అధికారులు వెల్లడించారు. సమీప గ్రామాల్లోని ప్రజలు, వివిధ శాఖల సహాయక సిబ్బంది పరుగున వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులెవరూ మరణించలేదని దక్షిణ రైల్వే ప్రకటించింది. గూడ్స్‌ రైలును ఢీకొన్నప్పుడు ముందుభాగంలో అన్నీ ఏసీ కోచ్‌లే ఉండటంతో వాటిలో ఉండే ప్రయాణికులు గాయపడ్డారని తెలుస్తోంది. వారందరినీ సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

పార్సిల్ వ్యానులో మంటలు

గతంలో గ్రీన్‌ సిగ్నల్స్‌ పడటం, రైలు ట్రాక్‌ మారడం వంటి తప్పిదాలు జరిగాయి. సరిగ్గా అదే తీరులో భాగమతి ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైంది. రాత్రి 8.27 సమయంలో ఈ రైలు పొన్నేరి స్టేషన్‌ దాటింది. కవరైపెట్టై స్టేషన్‌కు వస్తున్న సమయంలో ఆ రైలు ప్రధాన లైనుపై నుంచి కాకుండా లూప్‌లైన్‌లోకి వెళ్లడం, ఆ లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్‌ రైలును ఢీకొట్టడం క్షణాల్లో జరిగిపోయాయి. భాగమతి ఎక్స్ ప్రెస్ కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో రైలు వేగం గంటకు 75 కి.మీ. ఉన్నట్లు తెలుస్తోంది. ఇంజిన్‌ తర్వాత ముందుభాగంలో లగేజీ కోచ్‌తో పాటు 10 ఏసీ కోచ్‌లే ఉన్నాయి. ప్రయాణికులున్న హెచ్‌1, ఏ2 కోచ్‌లు ఏపీ నుంచి కర్ణాటక, తమిళనాడు వైపు వెళ్లే ప్రధాన మార్గంలోని పట్టాల పైకి ఎగిరి పడ్డట్లు సాక్షులు చెబుతున్నారు. పార్సిల్‌ వ్యానులో మంటలు చెలరేగినట్లు దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్ఎన్ సింగ్ చెప్పారు. ప్రమాదం జరిగిన మార్గంలో మరమ్మతు పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. రెండు రైళ్లును రద్దు చేయగా.. మరో అరడజనుకు పైగా రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed