కేసీఆర్‌కు ఎంపీ అర్వింద్ లేఖ.. హీటెక్కిస్తున్న నిజాం షుగర్స్ మ్యాటర్..?

by Shyam |
mp-arvind
X

దిశప్రతినిధి, నిజామాబాద్ : 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని వంద రోజుల్లో తెరిపిస్తామని ప్రకటించి, రెండు దఫాలుగా అధికారంలోకి వచ్చి హామీని విస్మరించడం బాధాకరమని.. నిజాం షుగర్ ఫ్యాక్టరీ 3 యూనిట్లను తక్షణమే తెరిపించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ లేఖ రాశారు. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రత్యేక రాష్ట్రం వస్తే తమ జీవితాలు బాగుపడతాయని, ఎంతోమంది ఆశతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారని గుర్తుచేశారు. దానికి భిన్నంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 306 మంది నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు.. 55,000 చెరుకు రైతుల కుటుంబాలు ఆగం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ చేసిన వాగ్దానానికి విరుద్ధంగా దేశంలో ప్రఖ్యాతి గాంచిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం లే ఆఫ్ ప్రకటించినందుకు చింతిస్తున్నానని తెలిపారు.

2018లో ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తామని, ఒకవేళ ప్రభుత్వం చెల్లించకపోతే సొంత డబ్బులతో వేతనాలు ఇస్తానని మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు హామీగానే మిగిలాయని అన్నారు. కోర్టు కూడా కార్మికులను మానవతా దృక్పథంతో వేతనాలు ఇవ్వాలని ఇచ్చిన తీర్పును మరోసారి గుర్తు చేస్తున్నాను అని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగా 70 మంది ఉద్యోగులు అవసరాలు తీర్చుకోలేని మానసిక క్షోభతో మరణించారని గుర్తుచేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ప్రణాళిక ఉందని, ప్రభుత్వం ఎన్‌సీఎల్‌టీ లేఖ ద్వారా తెలిసిందన్నారు. మూడేళ్లు గడుస్తున్నా ప్రణాళిక అమలు కాకపోవడం, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించిన చరిత్రను మూటగట్టుకున్నారని విమర్శించారు. నిజాం షుగర్ రైతులు చెరుకు పండించ లేక వరి పండిస్తున్నారని తెలిపారు. చెరుకుకు కేంద్ర ప్రభుత్వం మద్ధతు ధర ప్రకటించినందు వల్ల షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి రైతులకు, కార్మికులకు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఎంపీ అర్వింద్ సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Next Story

Most Viewed