రామోజీరావు ఇకలేరన్న వార్త ఆవేదన కలిగిస్తోంది: బాలయ్య ఎమోషనల్ కామెంట్స్

by Satheesh |
రామోజీరావు ఇకలేరన్న వార్త ఆవేదన కలిగిస్తోంది: బాలయ్య ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు మీడియా దిగ్గజం రామోజీ రావు మరణంపై హిందుపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని రామోజీ భౌతికాయానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి బాలయ్య నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రామోజీరావుకు ఆశ్రు నివాళి అని అన్నారు. రామోజీ రావు ఇక లేరు అన్న వార్త తీవ్ర ఆవేదన కలిగిస్తోందని ఎమోషనల్ అయ్యారు. తెలుగు పత్రిక రంగంలో ఆయన కొత్త వరవడి సృష్టించారని కొనియాడారు. భావితరాల పత్రికా ప్రతినిధులకు ఒక మార్గదర్శిగా నిలిచారాని ఆకాశానికెత్తారు.

చిత్ర పరిశ్రమలోనూ ఉషోదయ కిరణాలను ప్రసరింపజేశారని ప్రశంసించారు. రామోజీ రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. కాగా, గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న రామోజీ రావు చికిత్స పొందుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజూమున తుదిశ్వాస విడిచారు. సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు. రామోజీ ఫిల్మ్ సిటీలోనే రేపు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.



Next Story