సీమ జీవన గతికి అద్దం పట్టిన కవి - విద్వాన్ విశ్వం

by M.Rajitha |   ( Updated:2024-10-20 00:30:31.0  )
సీమ జీవన గతికి అద్దం పట్టిన కవి - విద్వాన్ విశ్వం
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రకృతి లోని అన్నిటిమీద అపారమైన అనుభూతి ఉంటుంది. అదే కవిని కవితగా గేమయముగా కావ్యముల మలిచేలా చేస్తుంది. నదులు మీద ఎందరో కవులు కవిత్వం వ్రాసారు, పాటలు పాడారు. కళ్ళకు కట్టినట్టు కృష్ణమ్మ పరవళ్లు వర్ణించారు. అటువంటిదే రాయలసీమ "పెన్నేటి పాట" గత వైభవాన్ని మరువలేక నేటి వర్తమాన దుస్థితిని జీర్ణించుకోలేక అక్షరాలలో బాధను వ్యక్తం చేసిన కవి మన విద్వాన్ విశ్వం.

ఇంత మంచి పెన్నతల్లి

ఎందుకిట్లు మారేనో

ఇంతమంది కన్నతల్లి ఎందుకెండిపోయేనో....

అంటూ ఊరుపై అభిమానం నదిపై ఎనలేని బంధమేర్పడి ఆనాటి ప్రజల జీవన పరిస్థితులు జీవన విధానాన్ని తనదైన అక్షరాలతో అల్లి పదాలతో జతకట్టి వ్రాసిన కన్నీటి పాటే పెన్నేటిపాట.

"నీటిలో కమ్మదనం లూరుచుండు ననీ

దోసిట నొక్కమారు పుక్కిలించిన జాల

నీ పుట్టు వునకు స్వార్థకత్వమ్ము

నిష్కల్మ షత్వముబ్బ"ననీ

నది పైన తనకు గల అభిమానాన్ని ప్రకటిస్తాడు.

కొందరి కవులలో కావ్యాలలో నడకను చూడవచ్చు, మరికొందరికి కవులలో ప్రాసను తిలకించివచ్చు, విశ్వం గారి తెన్నేటి పాటలో ఆవేదనను అర్ధం చేసుకోవచ్చు. రసాన్ని ఆస్వాదించవచ్చు. కవిత్వాన్ని యేరులా ప్రవహింప చేసాడు.

"కండలేక ఎండిపోయి బెండు వారినా సరే

తిండి లేక తుండు లేక పండవారినా సరే

నిండు మనసు నిజాయితీ

పండు వయసు పట్టుదలా

దండి చేయి ధర్మ దీక్ష పండించును గుండెల్లో అని పలికినపుడు ఆత్మశ్రయ ధోరణి వ్యక్తమవుతుంది.

పెన్నానదీ తీరం ఇసుక ఎడారి అయింది. పీనుగులకి, నక్కలకీ, గుడ్ల గూబలకీ విహారస్థలమైంది. ఆపులి నస్థలిలో పుర్రెలు మెండుగా పండుతాయట.... అంటూ..... ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇంతటితో ఆగక తన కలాన్నీ కాలంతో ముందుకు నడిపిస్తూ సంస్కృత భాష లోని పలు గ్రంధాలను తెలుగులోనికి అనువాదం చేసి పాఠకులందరిని సాహిత్యానికి దగ్గర చేశారు.

అవి -ఇవి, నలుపు-తెలుపు, మాణిక్యవీణ, వీరికన్నే, రాతలు -గీతలు, నా హృదయం వంటి శీర్షికలు వ్రాసి ఎనలేని కీర్తిని సాధించారు. ప్రేమించాను అనే నవలతో ప్రజల హృదయంలో చెరగని ముద్రణు వేసుకున్న విద్వాన్ విశ్వం గారి అసలు పేరు మీసరగండ విశ్వ రూపాచారి. ఈయన అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో 1915సం //లో అక్టోబర్ 21వ తేదీన జన్మించారు. ఆధునిక కవిగా, పండితుడిగా సాహిత్యానికి పెద్దపీఠం వేశారు. మీజాన్, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక వంటి పత్రికలకు సంపాదకత్వం వహించి ఎనలేని కీర్తిప్రతిష్టలకు వారసునిగా నిలిచారు. కాళిదాసు, భారవి, దండి కావ్యాలను వచనంగా తెనిగించి సాహిత్యానికి ప్రియులుగా ప్రజలకు చేరువయ్యాడు. సంఘసేవ, సాహిత్య ఆరాధన పెనవేసుకున్న కవి విద్వాన్ విశ్వం అంటారు తిరుమల రామచంద్రగారు.

(నేడు విద్వాన్ విశ్వం గారి జయంతి)

యం. లక్ష్మి

తెలుగు అధ్యాపకులు

VSM కళాశాల

రామచంద్రపురం

Advertisement

Next Story

Most Viewed