వర్షాకాలంలో మెరిసే అడవులు.. పశ్చిమ కనుమల్లో అలరిస్తున్న అందమైన దృశ్యం

by Javid Pasha |
వర్షాకాలంలో మెరిసే అడవులు.. పశ్చిమ కనుమల్లో అలరిస్తున్న అందమైన దృశ్యం
X

దిశ, ఫీచర్స్ : రాత్రిపూట మెరిసే మెరుపులు, విద్యుత్ వెలుగుల గురించి మనకు తెలిసిందే. కానీ వర్షాకాలంలో మెరిసే అడవుల గురించి మీరెప్పుడైనా విన్నారా? మన దేశంలోని పశ్చిమ కనుమలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లోని అడవుల్లో ఈ అద్భుత దృశ్యాలు ప్రతి వానాకాలంలోనూ ఆవిష్కృతమవుతూ అలరిస్తుంటాయి. అందుకే వీటిని గ్లోయింగ్ ఫారెస్ట్స్ అని కూడా పిలుస్తారు.

ప్రచారంలో ఎన్నో కథలు

అడవులు మెరువడం ఏమిటి? అనే సందేహాలు చాలామందికి కలుగుతుంటాయి. అయితే పురాతన కాలం నుంచి పశ్చిమ కనుమల్లోని అడవుల్లో దేవతలు సంచరిస్తున్నారని, అందుకే అవి రాత్రిపూట వెలుగులు విరజిమ్ముతుంటాయని పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పైగా ఆ మెరుపులను చూసిన వారు అదృష్ట వంతులని, జీవితంలో సక్సెస్ అవుతారని గ్లోయింగ్ ఫారెస్ట్స్ గురించి కొందరు చెప్తుంటారు. ఇవన్నీ ప్రజల్లో ఉండే అపోహలు. కానీ మెరిసే అడవులకు సంబంధించిన సైంటిఫిక్ రీజన్ మాత్రం వేరే ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.

ఎందుకు మెరుస్తాయి?

గ్లోయింగ్ ఫారెస్ట్స్ రాత్రిపూట మెరువడానికి ప్రధాన కారణం మైసెనా జాతికి చెందిన బయోలుమినిసెంట్ అనే శిలీంధ్రాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇవి గాలిలో అధిక తేమ ఉన్నప్పుడు కాంతిని వెదజల్లుతాయి. కాబట్టి వర్షాకాలంలోనే మెరుస్తాయి. అలాగే అడవుల్లోని కుళ్లిపోతున్న కలప, ఇతర సేంద్రియ పదార్థాలపై నివస్తుంటాయి. ప్రస్తుతం పశ్చిమ కనుమల్లో ఎక్కువగా ఉన్నాయి. రాత్రిళ్లు అవి కాంతి వెదజల్లుతున్నప్పుడు అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి. ఒక్కసారిగా పచ్చటి చెట్లు, పరిసరాలు అందంగా కనిపిస్తాయి. అడవి మొత్తం ఒకరకమైన కాంతితో వెలిగిపోతూ ఆకట్టుకుంటుంది.

మహారాష్ట్రలోని అభయారణ్యాల్లో..

పశ్చిమ కనుమలతో పాటు మహారాష్ట్రలోని భీమాశంకర్ వన్యప్రాణుల అభయారణ్యంలోని కొన్ని ప్రాంతాల్లో మైసెనా జాతికి చెందిన బయోలుమినిసెంట్ శిలీంధ్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడి అహుపే అనే ఓ చిన్న ట్రైబల్ విలేజ్ చుట్టు పక్కల గల అడవీ ప్రాంతంలో బయోలుమినిసెంట్స్ శిలీంధ్రాలు ఉండటంవల్ల ఇక్కడి అడవి ప్రాంతం రాత్రి పూట మెరుస్తూ ఉంటుంది. అందుకే ప్రస్తుతం భీమాశంకర్ వన్యప్రాణి రిజర్వ్ ఫారస్ట్‌ను గ్లోయింగ్‌ ఫారెస్ట్ అని కూడా పిలుస్తున్నారు.

లక్షద్వీప్, అండమాన్ దీవులు

లక్ష ద్వీప్‌లోని గోల్డెన్ ఐలాండ్‌లోనూ మెరిసే అడవులు ఉన్నాయి. ఇక్కడ వర్షాకాలపు రాత్రిళ్లలో అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు ఆవిష్కృతం అవుతుంటాయి. అలాగే కర్ణాటకలోని మట్టు-పదుకెరె బీచ్‌లు ఫారెస్ట్ ఏరియా కానప్పటికీ ఇక్కడి సముద్ర జీవుల కారణంగా కాంతి వెదజల్లుతూ ఉంటుంది. అట్లనే బయోలుమినిసెంట్ ఫైటోప్లాంక్టన్ శిలీంధ్రాల కారణంగా అండమాన్ దీవుల్లోని హేవ్ లాక్ ద్వీపం, మేఘాలయలోని క్రాంగ్ ఝరీ ప్రాంతం రాత్రిపూట మెరుస్తుంటాయి. అయితే ఈ మెరిసే అడవులను చూసేందుకు జులై, ఆగష్టు, సెప్టెంబర్ ఈ మూడు నెలలు మాత్రమే అనుకూల సమయంగా నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story