పావురాలకు ఆహారం పెడుతున్నారా? ప్రాణాంతక ముప్పు పొంచి ఉన్నట్లే..

by Sujitha Rachapalli |   ( Updated:2024-07-13 14:52:48.0  )
పావురాలకు ఆహారం పెడుతున్నారా? ప్రాణాంతక ముప్పు పొంచి ఉన్నట్లే..
X

దిశ, ఫీచర్స్: పెట్ లవర్స్ పెంపుడు జంతువులు, పక్షులకు ఆహారం పెట్టేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. దగ్గరుండి మరీ ఫీడ్ చేస్తారు. ముఖ్యంగా పిట్టలు, పావురాల విషయంలో మరింత మక్కువగా ఉంటారు. కానీ ఈ ఇష్టం అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పావురాలతో దీర్ఘకాలిక సావాసం ప్రాణాంతకంగా మారే శ్వాస కోశ సమస్యలకు కారణం అవుతుందని చెప్తున్నారు. ఢిల్లీకి చెందిన 11ఏళ్ల అబ్బాయిపై రీసెంట్ గా చేసిన అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది.

ముందుగా సాధారణ దగ్గులా అనిపించడంతో సర్ గంగారామ్ ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు వైద్యులు అధ్యయనంలో తెలిపారు. అయితే అతని శ్వాసకోశ పనితీరు క్షీణించడంతో పరిస్థితి మరింత దిగజారిందన్నారు. పావురం ఈకలు, రెట్టలు, వాటి ఎండిన అవశేషాలు కొంతమంది వ్యక్తులలో అలెర్జీ ప్రతిచర్యలను ప్రేరేపిస్తాయి, ఇవి తుమ్ములు, దగ్గు మరియు శ్వాసకోశ బాధ వంటి లక్షణాలకు దారితీస్తాయి. హైపర్సెన్సిటివిటీ న్యుమోనైటిస్ (HP) కు దారితీస్తుంది. కాగా ఇండియాలోని పలు నగరాల్లో పావురాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఈ కేసుల పెరుగుదల పెరుగుతుంది.

అంతేకాదు హిస్టోప్లాస్మోసిస్, క్రిప్టోకోకోసిస్, పిట్టకోసిస్‌తో సహా పావురాలు వివిధ వ్యాధులకు కారణం అవుతున్నాయి. ఈ రోగాలు పక్షి రెట్టలు, ఈకలు, శ్వాసకోశ స్రావాల ద్వారా మానవులకు సంక్రమించవచ్చు. ఎండిన పావురం రెట్టల నుంచి వచ్చే దుమ్ము కూడా శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది, ముఖ్యంగా ఆస్తమా లేదా క్రానిక్ బ్రోన్కైటిస్ వంటి పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులకు మరింత ప్రమాదకరం.

Advertisement

Next Story

Most Viewed