Bishnoi: పర్యావరణ యోధులు.. బిష్ణోయ్‌లు!!

by Hamsa |   ( Updated:2022-12-05 06:13:14.0  )
Bishnoi: పర్యావరణ యోధులు.. బిష్ణోయ్‌లు!!
X

దిశ, ఫీచర్స్: పర్యావరణ పరిరక్షణే బిష్ణోయ్ కమ్యూనిటీ లక్ష్యం. భారతదేశపు అసలైన పర్యావరణ యోధులుగా పేరుగాంచిన ఈ సంఘం.. అన్ని జీవుల పవిత్రతను విశ్వసిస్తూ మాంసాన్ని విస్మరిస్తుంది. మనుషుల మాదిరిగా ప్రాణం కలిగిన చెట్లను నరికివేయకుండా కంటికి రెప్పలా కాపాడుతుంది. 1.5 మిలియన్‌కుపైగా జనాభా కలిగిన ఈ హిందూ శాఖ సభ్యులు.. 500 సంవత్సరాలుగా ప్రకృతి సంరక్షణకు కట్టుబడి ఉన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని కుగ్రామాలలో అధికంగా ఉండే ఖేజారీ చెట్లను రక్షించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన అమృతా దేవి ప్రేరణతో అదే బాటలో పయనిస్తున్నారు.

చెట్లు, జంతువులను ఎందుకు రక్షిస్తారు?

బిష్ణోయ్ కమ్యూనిటీని 16వ శతాబ్దంలో గురు జంభేశ్వర్ స్థాపించారు. గురువు యొక్క 29 సూత్రాలలో.. విశ్వాసుల ప్రవర్తనను నియంత్రించే నియమాలు, ప్రకృతి రక్షణ స్పష్టంగా కనిపిస్తోంది. 'జీవరాశుల పట్ల దయ, ప్రేమ కలిగి ఉండాలి', 'పచ్చని చెట్లను నరకకూడదు' అని భక్తులు అంగీకరిస్తారు. ఈ విశ్వాసానికి కట్టుబడే 1730లో 363 మంది బిష్ణోయ్ పురుషులు, మహిళలు, పిల్లలు ప్రాణాలు విడిచారు.

పురాణాల ప్రకారం స్థానిక రాజు సిమెంట్ సున్నం బట్టీలకు ఇంధనం అందించడానికి, తన రాజభవనాన్ని నిర్మించడానికి కలపను తీసుకురావాలని అడవికి మనుషులను పంపించాడు. ఈ చర్యను అడ్డుకునే ప్రయత్నంలో.. అమృతా దేవి తన ఇంటి నుంచి బయటకు వచ్చి చెట్టు ట్రంక్‌ను చేతులతో చుట్టేసింది. చెట్లను కౌగిలించుకోవడం ద్వారా రక్షించడానికి ప్రయత్నించిన ఆమెను చాలా మంది ప్రజలు అనుసరించారు. కానీ సైనికులు కనికరించకుండా చెట్లతో పాటు వారి తలలను కూడా నరికివేశారు. ఈ క్రమంలో 'నరికిన చెట్టు కంటే మనిషి తల విలువైనది కాదు' అనే దేవి చివరి మాటలు ఇప్పటికీ ఆ కమ్యూనిటీలో స్ఫూర్తి నింపుతున్నాయి.

ఈ ఘటనలో దేవి ముగ్గురు కుమార్తెలతో సహా 363 మంది బిష్ణోయ్‌లు శిరచ్ఛేదనం చేయబడినప్పుడు చెట్లను కౌగిలించుకునే ఉన్నారు. వారి త్యాగం ఇప్పుటికీ ఆ గ్రామాల్లో స్మారక చిహ్నంగా ఉంది. ఆ త్యాగమూర్తుల పేర్లను చెక్కిన స్థానికులు.. అమృతా దేవి విగ్రహాన్ని ప్రతిష్టించుకున్నారు. కాగా భారతదేశంలోని బలమైన అటవీ సంరక్షణ ఉద్యమాలలో ఒకటైన ఆధునిక చిప్కో ఉద్యమాన్ని ప్రేరేపించడానికి ఈ సంఘటన సహాయపడింది.

మోడ్రన్ బిష్ణోయ్‌లు నమ్ముతున్నారా?

చాలామంది ఆధునిక బిష్ణోయ్‌లు తమ పూర్వీకుల త్యాగంతో స్ఫూర్తి పొందారు. బిష్ణోయ్ పురుషులు ఎక్కువగా రైతులు. ఏ జంతువుకు హాని జరగకుండా చూసేందుకు గస్తీ చేస్తారు. ఈ క్రమంలోనే పర్యావరణ ప్రచార బృందం, వేట నిరోధక సంస్థ 'బిష్ణోయ్ టైగర్ ఫారెస్ట్‌' కో ఫౌండర్ అడ్వకేట్ రాంపాల్ భవద్.. 'మనం ప్రకృతికి అనుగుణంగా జీవించాలి. అన్ని జీవుల పట్ల దయతో ఉండాలి. ఎందుకంటే భవిష్యత్తులో మానవ జాతి ముందుకు సాగుతుంది మరియు అభివృద్ధి చెందుతుంది' అని పిలుపునిచ్చాడు.

ఇక 45ఏళ్ల ఘేవర్ రామ్ తన జీవితాన్ని జంతువులకు అంకితం చేశాడు. గాయపడిన జీవుల కోసం రెస్క్యూ సెంటర్‌ను నడుపుతున్నాడు. 'నేను జంతువులను నా సొంత పిల్లల్లా చూస్తాను. ఇది చిన్నప్పటి నుంచి నేర్పించబడింది' అని చెప్తాడు. ఏడుగురు బిడ్డల తల్లి అయిన రామ్ భార్య సీతాదేవి కూడా ఇలాంటి భక్తురాలే. కర్రలతో కాకుండా ఆవు పిడకలతో వంట చేసే ఆమె.. ఓ అనాథ జింకకు స్వయంగా తన పాలనే ఇచ్చింది. ఫైనల్‌గా హిందూ మతం యొక్క ఉపవర్గం అయినప్పటికీ బిష్ణోయ్‌లు చనిపోయినవారిని దహనం చేయరు. అగ్నికి ఆజ్యం పోయడానికి చెట్లను నరికివేయాల్సి వస్తుందని పూడ్చిపెడుతారు.

Advertisement

Next Story

Most Viewed