సారీ.. ఇక మేం రాలేం.. మీరే వచ్చి తీసుకెళ్ళండి

by vinod kumar |
medical distributors
X

దిశ, తెలంగాణ బ్యూరో: సెకండ్ వేవ్ కరోనా వైరస్‌తో వివిధ సెక్షన్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులతో మరొకటి తోడైంది. సాధారణంగా మెడికల్ డ్రగ్ డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు నేరుగా ఆస్పత్రులకు, మందుల దుకాణాలకే వెళ్ళి రకరకాల మందుల్ని సరఫరా చేస్తుంటారు. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్ పరిస్థితుల్లో సిబ్బంది ఒక్కరొక్కరుగా పాజిటివ్ బారిన పడుతుండడంతో డోర్ డెలివరీ చేయాలనే సంప్రదాయానికి స్వస్తి చెప్పారు. ఆస్పత్రులూ, రిటైల్ మందుషాపుల నిర్వాహకులు డీలర్, డిస్ట్రిబ్యూటర్ దగ్గరికే వెళ్ళి మందులు తీసుకోవాల్సి ఉంటుంది. అసలే పేషెంట్ల హడావిడిలో ఉండే ఆస్పత్రులకు ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చిపడింది. ఇక నిత్యం రద్దీగా ఉండే మందుల షాపులు సైతం ఖాళీ అయిపోయిన మందుల్ని తిరిగి తెచ్చుకోవాలంటే రోడ్డెక్కక తప్పడంలేదు.

ఎందుకిలా?

డ్రగ్ డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని నాలుగు నెలలుగా వ్యాక్సిన్ ఇప్పించాల్సిందిగా కోరుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, వైద్య మంత్రి ఈటల రాజేందర్‌కు రాష్ట్ర డ్రగ్గిస్ట్స్, కెమిస్ట్స్ అసోసియేషన్ గతేడాది డిసెంబరు 14న లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసి ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించి వ్యాక్సిన్ ఇప్పించాల్సిందిగా కోరాయి. కానీ ఇప్పటికీ అది నెరవేరకపోవడంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తొమ్మిది మంది సిబ్బంది కేవలం కరోనా కారణంగా చనిపోయారని, వ్యాక్సిన్ ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదని మొత్తుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉన్నట్లయితే సెకండ్ వేవ్ అత్యవసర పరిస్థితుల్లో లక్షలాది మందుల దుకాణాలకు, వేలాది ఆస్పత్రులకు ఇప్పుడు ఈ ఇబ్బంది వచ్చి ఉండేది కాదని అసోసియేషన్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story