ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. టీడీపీకి ట్రబుల్ ఇస్తున్న జేసీ ఫ్యామిలీ.!

by Anukaran |
ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. టీడీపీకి ట్రబుల్ ఇస్తున్న జేసీ ఫ్యామిలీ.!
X

దిశ, ఏపీ బ్యూరో : 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి పాలైంది. చావు తప్పి కన్నులొట్టబోయినట్లుగా ఫలితాలొచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ సైలెంట్ అయిపోయింది. రెండున్నరేళ్లలో అసంతృప్తులు.. బుజ్జగింపులు.. వైసీపీకి అనుబంధంగా కొందరు ఎమ్మెల్యేలు వెళ్లిపోవడం వంటి పరిణామాలతో టీడీపీలో గందరగోళం నెలకొంది.

అంతేకాదు పార్టీలోని కొందరు సీనియర్లు అయితే జూ.ఎన్టీఆర్ రావాలంటూ వాదనను తెరపైకి సైతం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలు టీడీపీలో ప్రకంపనలు రేపాయి. అయితే ఇటీవలే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దూకుడు పెంచారు. దీంతో టీడీపీ నేతల్లో ఉత్సాహం నెలకొంది. నారా లోకేశ్ ప్రాంతాల వారీగా పార్టీ బలోపేతం కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

టీడీపీ సదస్సులో బయటపడ్డ అసమ్మతి..

ఒకవైపు చంద్రబాబు అండ్ నారా లోకేశ్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటే పార్టీలోని కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. అనంతపురం జిల్లాలో నీటి సమస్యలపై రాయలసీమ ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు నాయకత్వం వహించారు. రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తుపై సీమ నేతల సదస్సుకు రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఈ సదస్సుకు పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం హాజరయ్యారు. అయితే నాయకులంతా నీటి సమస్యలు, ప్రాజెక్టులపై మాట్లాడితే జేసీ ప్రభాకర్‌రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టుల సంగతి తర్వాత.. ముందు పార్టీ కార్యకర్తల సంగతి చూడండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమావేశానికి అందరినీ ఎందుకు పిలవలేదు. ఇదంతా చూస్తుంటే ఇద్దరు నేతల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడుస్తున్నట్టుంది అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కాల్వ శ్రీనివాసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. ఇలాంటి కార్యక్రమాల వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభమేమీ ఉండదన్నారు. రెండేళ్ల నుంచి ఒక్క టీడీపీ కార్యకర్తను కూడా పార్టీ నాయకత్వం పట్టించుకోలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. కేవలం కాల్వ శ్రీనివాసులు కనుసన్నల్లోనే ఈ సదస్సు జరుగుతోంది. ఆయన వెంట అనంతపురం టీడీపీ నాయకులు గానీ.. కార్యకర్తలు గానీ లేరంటూ విరుచుకుపడ్డారు. సమాచారం ఇవ్వకుండానే సాగునీటి ప్రాజెక్టులపై సదస్సులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. కార్యకర్తల కోసం మీటింగ్‌లు పెట్టాలి గానీ ఇలాంటి పనికిరాని సదస్సులు శుద్ధ దండగే అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు.

Next Story

Most Viewed