వచ్చే సీజన్‌లో హార్దిక్ పాండ్యా‌‌పై బ్యాన్?

by Harish |
వచ్చే సీజన్‌లో హార్దిక్ పాండ్యా‌‌పై బ్యాన్?
X

దిశ, స్పోర్ట్స్ : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్ నిర్వాహకులు అతనిపై ఓ మ్యాచ్ నిషేధం విధించారు. ఈ సీజన్‌లో శుక్రవారం లక్నోతో ముంబై చివరి మ్యాచ్ ఆడేసింది. కాబట్టి, వచ్చే సీజన్‌లో తొలి మ్యాచ్‌‌లో పాండ్యాపై వేటు పడనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అతను జట్టు మారినా ఆ జట్టు తొలి మ్యాచ్‌కు పాండ్యా దూరంకానున్నట్టు సమాచారం.

అసలేం జరిగిందంటే.. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు నిర్ణీత సమయంలోగా తమ బౌలింగ్ కోటాను పూర్తి చేయలేకపోయింది. స్లో ఓవర్ రేట్ నిబంధన ఉల్లంఘించడంతో పాండ్యాతోపాటు తుది జట్టు ఆటగాళ్లకు ఫైన్ విధించినట్టు ఐపీఎల్ నిర్వాహకులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సీజన్‌లో ముంబై స్లో ఓవర్ రేట్ నిబంధన ఉల్లంఘించడం ఇది మూడోసారి. దీంతో పాండ్యాకు రూ.30 లక్షలు జరిమానాతోపాటు ఓ మ్యాచ్ నిషేధం విధించారు. అలాగే, తుది జట్టు ఆటగాళ్లకు రూ. 12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం(ఏది తక్కువ అయితే అది) కోత పెట్టారు. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తర్వాత మ్యాచ్ నిషేధానికి గురైన రెండో సారథి పాండ్యా.

కాగా, ఐపీఎల్-17లో పేలవ ప్రదర్శన చేసిన ముంబై జట్టు లీగ్ స్టేజ్‌కే పరిమితమైంది. ఆఖరి మ్యాచ్‌లోనూ లక్నో చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో ముంబై కేవలం నాలుగింట మాత్రమే నెగ్గి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది.



Next Story