ఒక్క నెలలో 23లక్షల కరోనా కేసులు

by Shamantha N |
ఒక్క నెలలో 23లక్షల కరోనా కేసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో సుమారు 23లక్షలు (40%) ఒక్క సెప్టెంబరు నెలలోనే నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 64.73 లక్షలు దాటగా సుమారు 54.27 లక్షల మంది డిశ్చార్జి కావడంతో ఇంకా 9.45 లక్షల మంది యాక్టివ్ పాజిటివ్ పేషెంట్లుగానే ఉన్నారు. యాక్టివ్ పాజిటివ్ కేసుల్లో సుమారు 76% మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, ఉత్తరప్రదేశ్ తదితర పది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా తర్వాతి స్థానంలో ఉన్న భారత్ కరోనా మృతుల విషయంలో మాత్రం మూడవ స్థానంలో ఉంది. ప్రతీరోజు సగటున వెయ్యి మందికంటే ఎక్కువే చనిపోతున్నారు.

సెప్టెంబరు నెలలో 28వ తేదీ మినహా ప్రతీరోజు వెయ్యి మందికంటే ఎక్కువే కరోనా కారణంగా చనిపోయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ గణాంకాల ప్రకారం తేలింది. ఇందులో సుమారు 67% కరోనా మరణాలు మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఇక రోజువారీ నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సుమారు 55% మేర ఉన్నట్లు తేలింది. భారత్‌లో రికవరీ రేటు సుమారు 86% మేర ఉండగా యాక్టివ్ పాజిటివ్ రేటు 14% మేర ఉంది. గడచిన 24 గంటల్లో దేశం మొత్తం మీద 79వేలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదుకాగా కరోనా కారణంగా వెయ్యి మందికి పైగా చనిపోయారు. లక్ష కరోనా మృతులు నమోదైన దేశాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడవ స్థానంలో ఉంది.

Advertisement

Next Story

Most Viewed