ఉప్పొంగిన అప్పర్ మానేర్.. వరదలో చిక్కుకున్న ముగ్గురు!

by Sridhar Babu |   ( Updated:2021-07-15 04:54:07.0  )
upper-manair
X

దిశప్రతినిధి, కరీంనగర్ : ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతుండటంతో ఆయా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. బుధవారం రాత్రి కురిసిన వర్షాలకు జగిత్యాల జిల్లా కోరుట్ల సమీపంలోని యాకిన్ పూర్ వాగు పొంగిపొర్లుతోంది. గురువారం ఉదయం స్థానికులు గ్రామ శివార్లలో బహిర్భూమికని వెళ్లి ముగ్గురు వరదలో చిక్కుకున్నారు. ఉదయం విజయ్ అనే బాలుడు వాగులో చిక్కుకోవడంతో అతన్ని తాళ్ల సాయంతో స్థానికులు బయటకు లాగారు. కొద్దిసేపటి తర్వాత శ్రీనివాసులు అనే వ్యక్తి కూడా యాకిన్ పూర్ వాగులో చిక్కుకోవడంతో అతన్ని కూడా సేఫ్‌గా బయటకు తీసుకొచ్చారు. తాజాగా చాకుస్ అనే వ్యక్తి నీటిలో చిక్కుకున్నాడు. వరద ఉధృతి తీవ్రంగా ఉన్నప్పటికీ సంగెం వాసులు అతన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో మునిగిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మత్తడి పారుతున్న అప్పర్ మానేరు..

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని నదులు జలకళను సంతరించుకున్నాయి. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల సమీపంలోని ఎగువ మానేరు ప్రాజెక్టు మత్తడి పారుతోంది. 2.17 టీఎంసీల నీరు ఈ ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. జిల్లాలోని వీర్నపల్లి, ఎల్లారెడ్డి మండలాల మీదుగా వెలుతున్న వాగు ఉప్పొంగడంతో రెండు మండలాలకు మధ్య సంబంధాలు తెగిపోయాయి. కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం సమీపంలోని పారువెల్ల వాగులో వరద తీవ్రత పెరిగిపోయింది. దీంతో చొక్కరావుపల్లి, పారువెల్ల, జంగపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Advertisement

Next Story

Most Viewed