లాక్‌డౌన్ వార్తలు.. సొంత గ్రామాలకు జనాలు

by  |
లాక్‌డౌన్ వార్తలు.. సొంత గ్రామాలకు జనాలు
X

దిశ, నల్లగొండ: హైదరాబాద్​లో మరోసారి లాక్​డౌన్​ విధిస్తారనే వార్తలు విస్తృతంగా ప్రచారం కావడంతో జనాలు భారీగా సొంత గ్రామాలకు బయలుదేరారు. దీంతో బుధవారం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద బుధవారం భారీగా రద్దీ నెలకొంది. మంగళవారం ఉదయం నుంచి ఇవాళ్టి వరకు 27 వేలకు పైగా వాహనాలు టోల్​ప్లాజా దాటి వెళ్లాయని సిబ్బంది తెలిపారు. హైదరాబాద్​లో 15 రోజులపాటు లాక్​డౌన్​ విధిస్తారనే ఊహాగానాల నేపథ్యంలో టోల్​గేట్ల వద్ద రద్దీ పెరిగింది. నగరవాసులు సొంతూళ్లకు బయలుదేరారు. అంతేకాకుండా కొర్లపహాడ్ టోల్ గేట్ల వద్ద కూడా వాహనాల రద్దీ విపరీతంగా ఉన్నట్టు సమాచారం. విజయవాడ, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలకు వెళ్తున్న వారితో విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య పెరిగింది. రోజూ దాదాపు 23 వేల వాహనాలు పంతంగి టోల్​ప్లాజా దాటివెళ్తున్నాయని, ఇవాళ రాత్రికి కూడా భారీగా వాహనాలు వెళ్లే అవకాశం ఉందన్నారు. లాక్​డౌన్​పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా.. ప్రజలు ముందు జాగ్రత్తగా స్వగ్రామాలకు క్యూ కడుతున్నారు.

చెక్ పోస్టుల వద్ద పరిస్థితి ఇదీ..

హైదరాబాద్‌‌లో లాక్‌‌డౌన్ విధిస్తారనే వార్తలతో హైదరాబాద్‌‌తో పాటూ తెలంగాణ జిల్లాల నుంచి ఏపీకి జనాలు క్యూ కట్టారు. వేలాదిమంది సొంత రాష్ట్రానికి బయల్దేరారు. దీంతో ఏపీ సరిహద్దుల్లో ఉన్న చెక్‌ పోస్టుల దగ్గర భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అయితే తెలంగాణ నుంచి ఏపీకి వస్తున్న వారంతా నిబంధనలు పాటించాల్సిందే అని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారు కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందేనని గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. స్పందన ద్వారా దరఖాస్తు చేసుకొని పాస్ పొందాలన్నారు. పాస్ ఉన్న వారిని సరిహద్దులోని చెక్‌ పోస్టుల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామన్నారు. పాస్‌‌లు ఉన్నా కూడా రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు అనుమతించేది లేదన్నారు. రాత్రి వేళల్లో అత్యవసర, నిత్యావసర సర్వీసులకు అనుమతి కొనసాగుతుందని తెలిపారు.


Next Story

Most Viewed