అందరిలోనూ చివరి అస్త్రం భయం.. స్తంభించిన లావాదేవీలు

by Anukaran |
Fear of lock down on all sectors
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కరోనా పాజిటివ్​కేసుల సంఖ్య జనాన్ని భయపెడుతోంది. రాష్ట్రంలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో లాక్ డౌన్ పెడతారనే భయం నెలకొంది. కరోనా కేసుల తీవ్రత కూడా లాక్​డౌన్​ తప్పనిసరి అని సూచిస్తుందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోడీ కరోనా కట్టడికి ఆఖరి అస్త్రంగా లాక్​డౌన్ పెట్టాలని రాష్ట్రాలకు సూచించిన అంశం బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. దాని ప్రభావం అనేక రంగాలపై తీవ్రంగా చూపిస్తోంది. ఒకటీ రెండు అంశాలు కాదు.. ప్రైవేటు, వ్యాపార రంగాలన్నీ లాక్​డౌన్​దిశగా ఆలోచిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో పనులను నిలిపివేశారు. అంతకు ముందు కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేసుకుంటున్నారు. ఆస్తుల క్రయ విక్రయాల్లో అగ్రిమెంట్లను రద్దు చేసుకోవడం, కాల పరిమితిని పొడిగించుకోవడం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏ ఒక్కరూ లావాదేవీలు నడిపేందుకు ముందుకు రావడం లేదు.

ముందుకా.. వెనక్కా?

ఇప్పటికే తలపెట్టిన పనులను కొనసాగించాలా? వాయిదా వేయాలా? రద్దు చేసుకోవాలా? తెలియక చాలా మంది తికమకపడుతున్నారు. ప్రధానంగా పెళ్లిళ్లు, ఇండ్లు, ఫ్లాట్ల కొనుగోళ్లపై ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ముందుకు వెళ్తే కరోనా వ్యాప్తి తీవ్రతకు బలి కావాల్సి వస్తుందన్న భయం నెలకొంది. పైగా అందుతాయనుకున్న డబ్బులు నిలిచిపోతున్నాయి. ఎవరిని డబ్బుల కోసం అడిగినా అంతటా.. కరోనా వైరస్ పెట్టుకొని డబ్బులు ఎలా ఇస్తారనుకుంటున్నారన్న అనే సమాధానమే వస్తుందని పెళ్లిళ్ల నిర్వాహకులు అంటున్నారు. ఏ ఫంక్షన్​హాల్​కి వెళ్లినా ముందుగా అనుకున్నట్లుగా కాకుండా అతి తక్కువ మందితోనే పెళ్లి చేస్తామని, అనుకున్న ప్రకారం రెంట్​ఇవ్వలేమంటూ బతిలాడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

మళ్లీ మందగించిన రియల్ ఎస్టేట్ రంగం

ఇండ్లు, ఫ్లాట్లు కొనేందుకు కూడా అవసరమైన మొత్తాన్ని సర్దుబాటు చేసుకున్న తర్వాత ఎంపిక చేసుకున్నారు. కానీ ఇప్పుడేమో లావాదేవీలు నిలిచిపోవడంతో అనుకున్న పనులను రద్దు చేసుకుంటున్నారు. ఒకటీ రెండు ఉదాహరణలు కాదు.. రద్దు చేసుకున్న క్రయ విక్రయాల ఒప్పందాలు నగర శివార్లలో వేలాదిగా దర్శనమిస్తున్నాయి. గడిచిన వారం రోజులుగా ఏ రియల్​ఎస్టేట్​ఆఫీసుకు వెళ్లినా ఇలాంటి రద్దు, కాల పరిమితి పొడిగింపు వంటి అంశాలపైనే చర్చలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా నగర శివార్లలో బడంగ్​పేట, మీర్​పేట, బండ్లగూడ కార్పొరేషన్లు, తుర్కయంజాల్, ఆదిబట్ల, పెద్ద అంబర్​పేట, మేడ్చల్, శామీర్​పేట, తూంకుంట, ఘట్ కేసర్​తదితర మున్సిపాలిటీల్లో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది.

అన్నీ నిలిపివేత

ఎల్బీనగర్​సమీపంలోని ఓ పెట్రోల్ బంక్. లారీలు, డీసీఎంలు, పొక్లెయిన్ వాహనాలకు డీజిల్​పోయడం.. వారికి బిల్లులు వచ్చినప్పుడు డబ్బులు తీసుకోవడం పరిపాటి. ఇప్పుడేమో లాక్​డౌన్​ఎప్పుడు పెడతారో తెలియని అయోమయం. డీజిల్​బిల్లు ఇవ్వమని అడిగితే పనులు నిలిచిపోయాయని, ఇప్పట్లో చెల్లించలేమంటూ వాహనాల యజమానులు తెగేసి చెబుతున్నారు. ఐతే డీజిల్​కంపెనీ యాజమాన్యం మాత్రం చెల్లించాల్సిందేనంటూ నోటీసులు జారీ చేసింది. చెల్లించేందుకు అప్పు కూడా పుట్టకపోవడంతో పెట్రోల్​ పంప్​యజమాని లబోదిబోమంటున్నారు. లాక్​డౌన్​ఉంటుందో, ఉండదో తెలియదు. కానీ జనం మాత్రం గందరగోళానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అడ్వాన్స్‌లు ఇచ్చి ఇరకాటం

వచ్చే గురువారం పెళ్లి. బీఎన్​రెడ్డినగర్​లోని ఓ ఫంక్షన్ హాల్​ను మాట్లాడుకున్నారు. ఇరుపక్షాలు పెళ్లికి 1000 మందిని పిలవాలని అనుకున్నారు. ఇంతలోనే కరోనా వ్యాప్తి జోరందుకున్నది. ఇప్పుడేమో 100 మందితోనే పూర్తి చేయాలనుకుంటున్నారు. కానీ ఫంక్షన్​హాల్​మాత్రం పెద్దది. ఆ స్థాయిలోనే కిరాయి. ఇప్పుడేమో పదో వంతుతోనే పెళ్లి. మరి మొత్తం డబ్బులు చెల్లించాలా? అని ఆందోళన. వంటవాళ్లను, భాజాబజెంత్రీలు, డెకరేషన్​… అన్నీ మొదట అనుకున్న స్థాయికి తగ్గట్టుగానే అడ్వాన్సులు ఇచ్చారు. ఇప్పుడేం చేయాలో తెలియక తికమకపడుతున్నారు.

నిలిచిన ఇంటి కొనుగోలు

నల్లగొండ జిల్లాకు చెందిన ఓ వ్యాపారి అల్మాస్​గూడలో ఓ ఇంటిని కొనేందుకు రేటు మాట్లాడుకున్నారు. టోకెన్​అమౌంట్ ఇచ్చారు. వారంలో అగ్రిమెంటు కుదుర్చుకుంటామని చెప్పారు. కానీ ఇప్పుడు కరోనా కేసుల సంఖ్య పెరగడంతో అన్ని లావాదేవీలు నిలచిపోయాయి. దాంతో అగ్రిమెంటు కుదుర్చుకోవడానికి అవసరమైన 25 శాతం అమౌంట్​రాలేదు. పైగా ఎప్పుడు వస్తాయో కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో టోకెన్​అమౌంట్​తోనే ఇంటి కొనుగోలును నిలిపివేశారు.

Advertisement

Next Story